లిక్కర్‌కి డబ్బులు అడిగితే ఇవ్వలేదని.. పూజారిని కొట్టి చంపిన దుండగుడు

లిక్కర్‌కి డబ్బులు అడిగితే ఇవ్వలేదని.. పూజారిని కొట్టి చంపిన దుండగుడు

దారిన వెళ్తున్న పూజారిని ఆపి గుర్తు తెలియని వ్యక్తి ఆపి మందు తాగడానికి డబ్బులు కావాలంటూ అడ్డు తగిలి, ఇవ్వలేదన్న కోపంతో దారుణంగా కొట్టి చంపాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో శనివారం రాత్రి జరిగింది. యూపీలోని అజంగఢ్ జిల్లా గలౌర్ గ్రామానికి చెందిన 80 ఏళ్ల పూజారి శనివారం రాత్రి పక్కనే ఉన్న గ్రామానికి వెళ్లి వస్తుండగా ఒక గుర్తు తెలియని వ్యక్తి అడ్డుగా వచ్చాడు. అప్పటికే ఫుల్లుగా లిక్కర్ తాగి తూలుతున్న అతడు.. మందు కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వాలంటూ పూజారిని అడిగాడు. తన దగ్గర లేవంటూ పక్కకు జరిగి వెళ్లిపోబోయాడాయన. అయినా వదలకుండా డబ్బులు ఇవ్వాల్సిందేనంటూ అల్లరి చేశాడు. అతడిని పట్టించుకోకుండా పూజారి ముందుకు వెళ్లిపోతుండడంతో కోపంగా కర్ర తీసుకుని దాడికి దిగాడు మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి. ఆ పెద్దాయన దెబ్బలకు తాళలేక వదిలేయమని కేకలు వేస్తున్నా తనకేం వినబనట్టు దారుణంగా కొట్టాడు.

దూరంగా ఉన్నవాళ్లు చూసి పరిగెత్తుకుని రావడంతో పూజారిని వదిలేసి పారిపోయాడు. అప్పటికే తీవ్రంగా గాయపడిన ఆయనను ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ లాభం లేకపోయింది. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం ఆ పూజారి ప్రాణాలు వదిలారు. ఈ విషయం తెలిసి గ్రామస్థులు కోపంతో రగిలిపోయారు. పూజారి మృతదేహంతో అజంగఢ్ – గోరఖ్‌పూర్ రోడ్డుపై బైఠాయించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ ఆందోళన చేశారు. దీంతో అజంగఢ్ జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ సింగ్ అక్కడికి చేరుకుని వాళ్లకు సర్ది చెప్పారు. శనివారం రాత్రే నిందితుడిని అరెస్టు చేశామని, అతడికి కఠినంగా శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చి ఆందోళన విరమింపజేశారు.