కదులుతున్న రైలు మీదికి విసిరారు.. చేయి, కాళ్లు కోల్పోయిన నీట్ విద్యార్థిని

కదులుతున్న రైలు మీదికి విసిరారు.. చేయి, కాళ్లు కోల్పోయిన నీట్ విద్యార్థిని

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో 17 ఏళ్ల బాలిక, నీట్‌ కోచింగ్ నుంచి తిరిగి వస్తుండగా అడ్డుకున్నఇద్దరు యువకులు.. కదులుతున్న రైలు ముందు విసిరివేశారు. దీంతో ఆమె అవయవాలను కోల్పోయింది. రెండు కాళ్లు, చేయి కోల్పోయిన బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు.

అక్టోబర్ 10న రాత్రి సీబీ గంజ్ ప్రాంతంలో బాలిక కోచింగ్ నుంచి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై స్పందించిన యోగి ఆదిత్యనాథ్.. ఇన్‌స్పెక్టర్‌, చౌకీ ఇన్‌ఛార్జ్‌, బీట్‌ కానిస్టేబుల్‌ను సస్పెండ్‌ చేశారు.

నిందితుల్లో ఒకరిని, అతని తండ్రిని అరెస్టు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బాలికకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించింది. బాలిక మేనమామ తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు ఇంటర్మీడియట్ విద్యార్థిని, సాయంత్రం కోచింగ్ క్లాసులకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. అరెస్టయిన యువకుడు, అతని స్నేహితుడు ఆమెను తరచూ వేధించేవాడు. దీనిపై యువతి కుటుంబీకులు యువకుడి కుటుంబీకులకు ఫిర్యాదు చేసినా ఏం లాభం లేకపోయింది.

మంగళవారం సాయంత్రం, ఆమె ఇంటికి తిరిగి వస్తుండగా, అబ్బాయిలు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. దానికి ఆమె ప్రతిఘటించడంతో, వారు ఆమెను కదులుతున్న రైలు ముందుకు నెట్టారు. ఆ తర్వాత బాలిక రక్తపు మడుగులో పడి కాళ్లు, ఒక చేయి తెగిపోయి కనిపించింది. ఘటన అనంతరం ఆమెను రాత్రి ఇజ్జత్‌నగర్‌లోని ఆసుపత్రికి తరలించగా వైద్యులు శస్త్రచికిత్స చేశారు. మరోవైపు బాలిక పరిస్థితి విషమంగా ఉందని, ఆమె ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని ఆసుపత్రి డాక్టర్ ఓపీ భాస్కర్ తెలిపారు.