ఉప్పల్ ఎమ్మెల్యేపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి

ఉప్పల్ ఎమ్మెల్యేపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి

హైద‌రాబాద్: ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి భూ ఆక్రమణకు పాల్పడినా పోలీసులు ముందుగా కేసు రిజిష్టర్ చేయలేదన్నారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. మంగ‌ళ‌వారం ఆయ‌న‌ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ..అధికార‌ పార్టీ అండ‌తోనే ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి భూ ఆక్రమణకు పాల్పడ్డారన్నారు. అడ్డుకునే వారెవ‌రూలేర‌నే ధీమాతోనే ఇలా టీఆర్ఎస్ లీడ‌ర్లు రెచ్చిపోతున్నార‌న్నారు. ఉప్ప‌ల్ ఎమ్మెల్యేకు అనుకూలంగా పోలీసులు వ్యవరించారని.. కేసు నమోదు చేయాలని కోర్టు చెప్పినా పోలీసులు నిర్లక్ష్యంగా ఉన్నార‌న్నారు. పిటిషన్ దారుడు మరోసారి కోర్టుకు వెళ్తే హైకోర్ట్ ఆదేశాల ప్రకారం కేసు నమోదు అయ్యింద‌న్నారు. వెంట‌నే పోలీసులు ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, ఎమ్మార్వో గౌతం కుమార్  ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

కేసు నీరుగార్చకుండా చూడాలన్న ప్ర‌భాక‌ర్..ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డికి CMOలో ఉన్న ఉన్నతాధికారుల సహకారం ఉందని తెలిపారు. అందుకే భూ కబ్జాలకు పాల్పడుతున్నారని..CMO నుంచే డైరెక్షన్ నడుస్తుందని చెప్పారు. అందుకే కోర్టు నెల రోజుల కిందే అదేశాలు ఇచ్చినా ఇంకా కేసు నమోదు కాలేదన్నారు. టీఆర్ఎస్ పాలన మొత్తం కూడా అవినీతి పాలన అయ్యిందని..ఇదే చివరి కాలమన్నారు. మళ్లీ  ప్రభుత్వం రాదని తెలిసే ప్రజా ప్రతినిదులు దోచుకోవ‌డం మొద‌లుపెట్టార‌న్నారు. ఉప్పల్ ఎమ్మెల్యే భూ ఆక్రమణపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు ప్ర‌భాక‌ర్.