
ఇప్పటివరకు సైంటిస్టులు కనిపెట్టిన మూలకాలలో యురేనియం కూడా ఒకటి. కానీ, మిగతా వాటితో పోలిస్తే ఇది చాలా భిన్నమైనది, శక్తివంతమైనది. దీనికి ప్రపంచాన్నే నాశనం చేసే శక్తి ఉంది. అందుకే ఇది ఏ దేశం దగ్గర ఉన్నా దాని శత్రు దేశాల వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటి యురేనియంను ఈమధ్య ఇరాన్ సేకరించడం, శుద్ధి చేయడం మొదలు పెట్టింది. అందుకే తమకు ప్రమాదమని భావించిన ఇజ్రాయిల్, అమెరికా దేశాలు ఇరాన్ పై దాడులు చేసి, న్యూక్లియర్ ప్లాంట్లను ధ్వంసం చేసినట్లు ప్రకటించాయి. ఇంతకీ ఇది ఎక్కడ దొరుకుతుంది? దీన్ని అణ్వాయుధాలుగా మార్చడం అంత సులభమా?
యురేనియం అంటే..
యురేనియం వెండి, బూడిద రంగులో ఉండే ఒక లోహం. ఇది భూమిలో, నీటిలో సహజంగానే దొరుకుతుంది. ఇది ప్రధానంగా మూడు ఐసోటోపుల మిశ్రమం. U–238 చాలా సాధారణ ఐసోటోప్. రెండో రకమైన U–235ని అణు రియాక్టర్లు, అణ్వాయుధాల్లో ఉపయోగిస్తారు. U–234ని జియోలాజికల్ డేటింగ్, పరిశ్రమల్లో వాడతారు.
ఎక్కడ వాడతారు
యురేనియంకు ఉన్న ప్రత్యేక లక్షణాల వల్లే దాన్ని అనేక రంగాల్లో ఉపయోగిస్తున్నారు. లోహ పరిశ్రమల్లో మెటిరీయల్ టెస్టింగ్కి ఉపయోగిస్తున్నారు. యురేనియం రేడియోధార్మిక ఐసోటోపులను వైద్య రంగంలో రేడియోథెరపీ, డయాగ్నస్టిక్ ఇమేజింగ్లో వాడుతున్నారు. రేడియోమెట్రిక్ డేటింగ్లో కూడా వీటిని వాడుతున్నారు. ఇది శిలాజాలు, ఖనిజాల వయసును నిర్ణయించడానికి సాయపడుతుంది. దీని అధిక సాంద్రత వల్ల రక్షణ రంగంలో ట్యాంకులు, ఇతర ఆయుధాల కవచంగా కూడా ఉపయోగిస్తుంటారు. అలాగే అణు విద్యుత్, అణ్వాయుధాల్లోనూ యురేనియంను వాడతారు.
అణు విద్యుత్ : యురేనియం 235 ఐసోటోప్ను అణు రియాక్టర్లలో ఇంధనంగా వాడుతున్నారు.
దీని ద్వారా ఉత్పత్తి అయ్యే శక్తితో నీటిని ఆవిరిగా మారుస్తారు. ఆ ఆవిరితో టర్బైన్లను తిప్పి కరెంట్ని ఉత్పత్తి చేస్తారు. ఇలా కరెంట్ని తయారు చేసే అణు రియాక్టర్లు మన దేశంలో మొత్తం 22 ఉన్నాయి. చిన్న మొత్తంలో యురేనియం కూడా భారీగా విద్యుత్తును ఉత్పత్తి చేయగలదు. ఉదాహరణకు, ఒక కోడిగుడ్డు పరిమాణంలో ఉండే యురేనియం 88 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసే విద్యుత్తుకు సమానం. అందుకే మనదేశంలో 2035 నాటికి న్యూక్లియర్ విద్యుత్ను 25 శాతానికి పెంచే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది.
అణ్వాయుధాలు: అణ్వాయుధాల తయారీలో కూడా యురేనియం 235నే ఉపయోగిస్తున్నారు. కానీ.. అందుకు సాధారణ యురేనియం పనికిరాదు. అణు బాంబుకు ‘‘వెపన్ గ్రేడ్’’ యురేనియం అవసరం. అంటే యురేనియంను 80% నుంచి 90% లేదా అంతకంటే ఎక్కువ శుద్ధి చేయాలి. అందుకోసం అనేక సార్లు శుద్ధి చేయాల్సి ఉంటుంది. అది చాలా కష్టమైన పని. అధునాతన టెక్నాలజీ అవసరం ఉంటుంది. ఇలా శుద్ధి చేయడాన్ని ‘‘యురేనియం ఎన్రిచ్మెంట్’’ అంటారు. ప్రస్తుతం అమెరికా, రష్యా, చైనా,పాకిస్తాన్, భారత్ వంటి దేశాలు అణ్వాయుధ నిల్వలను పెంచుకుంటున్నాయి.
ఎక్కడ దొరుకుతుంది ?
యురేనియంను ప్రధానంగా యురనైట్(పిచ్బ్లెండ్) వంటి ఖనిజం నుంచి సేకరిస్తారు. భూమి పైపొరల్లో ఉండే యురేనియం నిల్వలను వెలికి తీయడానికి ఓపెన్ పిట్ మైనింగ్ పద్ధతిని ఉపయోగిస్తారు. నిల్వలు చాలా లోతులో ఉంటే అండర్ గ్రౌండ్ మైనింగ్ చేస్తారు. తవ్వి తీసిన ఆ ఖనిజాన్ని మిల్లింగ్ చేసి ‘‘ఎల్లో కేక్” అనే పదార్థంగా తయారుచేస్తారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా, కజకిస్థాన్, కెనడా, రష్యా, నమీబియా, దక్షిణాఫ్రికా, నైజర్, చైనా, బ్రెజిల్ దేశాల్లో పెద్ద మొత్తంలో యురనైట్ నిల్వలు ఉన్నాయి.
ఎలా శుద్ధి చేస్తారు ?
“ఎల్లోకేక్" (U-3O8)గా మార్చిన యురేనియం ఖనిజాన్ని రసాయన ప్రక్రియల ద్వారా వాయువు రూపంలో ఉండే యురేనియం హెక్సాఫ్లోరైడ్ (UF-6)గా మారుస్తారు. ఇందులో U-235, U-238 రెండూ ఉంటాయి. వీటి ఐసోటోప్ల మధ్య కొంత వ్యత్యాసం ఉంటుంది. దాని ఆధారంగా వాటిని వేరు చేస్తారు. ఆ తర్వాత U-235 గాఢతను పెంచుతారు. దీనికి పెద్ద ప్లాంట్లు, భారీగా కరెంట్ అవసరం అవుతాయి. అవసరమైనంత శుద్ధి చేసిన తర్వాత, UF-6 వాయువును తిరిగి యురేనియం లోహంగా మారుస్తారు. ఈ లోహాన్ని అణ్వాయుధాలు తయారీలో ఉపయోగిస్తారు. వాటిని తయారు చేసే దేశాలు ఈ ప్రక్రియను చాలా రహస్యంగా, కఠినమైన భద్రత మధ్య పూర్తి చేస్తారు. ఈ సాంకేతికత అందరికీ అందుబాటులోకి రాకుండా నిరోధించడానికి అంతర్జాతీయ అణుశక్తి సంస్థ కఠినమైన నిబంధనలను అమలు చేస్తోంది.
నష్టాలెన్నో..
యురేనియం కనిపించని శత్రువు లాంటిది. సహజంగానే దీని నుంచి ఎప్పుడూ రేడియేషన్ విడుదల అవుతూ ఉంటుంది. U-235 అర్ధ జీవితం 703.8 మిలియన్ సంవత్సరాలు. U-238 అర్ధ జీవితం 4.468 బిలియన్ ఏండ్లు. ఈ లెక్కన ఈ ఐసోటోప్ పూర్తిగా క్షీణించడానికి కొన్ని బిలియన్ల సంవ్సరాలు పడుతుంది. కాబట్టి ఇవి చాలా ఏండ్ల వరకు రేడియేషన్ని విడుదల చేస్తాయి.
ఇది విడుదల చేసే ఆల్ఫా, బీటా, గామా కణాలు మనిషి డీఎన్ఏను దెబ్బతీస్తాయి. న్యూక్లియర్ ప్లాంట్లు, ఆయుధ తయారీ కేంద్రాల్లో పనిచేసేవాళ్లు సరైన జాగ్రత్తలు పాటించకపోతే క్యాన్సర్లు, మూత్రపిండాల వైఫల్యం వంటి సమస్యలు వస్తుంటాయి. దీనివల్ల పర్యావరణానికి కూడా ముప్పు కలుగుతుంది.
యురేనియం తవ్వకాల వల్ల భూమి పైభాగం కాలుష్యం అవుతోంది. తవ్వకాలు జరిపిన ప్రాంతాల్లో రేడియేషన్ వల్ల భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. దాంతో అక్కడ పిల్లలు అనేక లోపాలతో పుడుతున్నారు. ఉదాహరణకు.. యురేనియం తవ్వకాలు జరిగే జార్ఖండ్లోని జాదుగూడ గ్రామంలో నివసించే ఆదివాసీలు అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు సోషల్ యాక్టివిస్ట్లు చెప్తున్నారు.