
ఎక్కడైనా బాంబు పేలుళ్లు జరిగినప్పుడు ఎంతో మంది జనం చనిపోతుంటారు. అక్కడ టెర్రరిస్టులు వాడే బాంబులు కొద్ది మొత్తంలోనే ఉంటాయి. మరి, టన్నుల కొద్దీ బాంబులు వేస్తే పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఒకటి కాదు.. రెండు కాదు.. 36 టన్నుల బాంబులు వేస్తే ఎట్లుంటది? ఇరాక్లోని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) టెర్రరిస్టుల క్యాంపులపై అమెరికా దళాలు అలాగే విరుచుకుపడ్డాయి. టైగ్రిస్ నదికి మధ్య ఉండే ఖానస్ దీవుల్లో ఐఎస్ టెర్రరిస్టులు ఉన్నారన్న సమాచారంతో ఎఫ్15, ఎఫ్35 ఫైటర్ జెట్లతో అమెరికా బలగాలు 36 టన్నుల బాంబులను జార విడిచాయి. సెకండ్ ఇరాకీ స్పెషల్ ఆపరేషన్స్ ఫోర్సెస్ బెటాలియన్కు చెందిన టీం ఈ ఆపరేషన్ చేసింది. దాదాపు దీవి మొత్తం బాంబుల వర్షం కురిపించింది. అయితే, ఆ దాడిలో ఎంత మంది టెర్రరిస్టులు చనిపోయారన్నది మాత్రం వెల్లడించలేదు. దాడి వీడియోను ఆపరేషన్స్ జాయింట్ రిజాల్వ్ ప్రతినిధి కల్నల్ మైల్స్ బీ కాగిన్స్ ట్వీట్ చేశారు.