NRI News: శుభవార్త.. అమెరికా నుంచి ఇండియాకు పంపే డబ్బుపై టాక్స్ 1 శాతానికి తగ్గింపు

NRI News: శుభవార్త.. అమెరికా నుంచి ఇండియాకు పంపే డబ్బుపై టాక్స్ 1 శాతానికి తగ్గింపు

US Remittance Tax : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని వారాల కిందట అమెరికా నుంచి ఇతర దేశాలకు పంపే డబ్బుపై కూడా రెమిటెన్స్ టాక్స్ వసూలు చేయాలని నిర్ణయించారు. అయితే మెుదట్లో దీనిని 5 శాతంగా ఉంచాలని తాను భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. దీంతో అమెరికాలో ఉద్యోగ, ఉపాధి పొందుతున్న విదేశీయులు కొంత ఆందోళనకు గురైన సంగతి తెలిసిందే. గతంలో అమెరికా ఇతర దేశాలకు వ్యక్తులు పంపే డబ్బుపై ఎలాంటి పన్ను వసూలు చేయలేదని తెలిసిందే.

అయితే తాజాగా అమెరికాలో నివసిస్తున్న ఎన్ఆర్ఐలకు ట్రంప్ సర్కార్ నుంచి కీలక శుభవార్త వచ్చింది. ట్రంప్ ప్రభుత్వం తీసుకొస్తున్న వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ లో విదేశీయులు అమెరికా నుంచి తమ దేశాలకు పంపే డబ్బుపై రెమిటెన్స్ టాక్స్ ను గతంలో ప్రతిపాదించిన 5 శాతం నుంచి 1 శాతానికి తగ్గించాలని నిర్ణయించబడింది. దీనికి ముందు మే 2025లో తీసుకొచ్చిన బిల్ ప్రకారం హెచ్ 1బి, హెచ్ 2ఏ వీసాలతో నివసిస్తున్న ప్రజలు తమ స్వదేశాలకు పంపే డబ్బు, మనీ ఆర్డర్లు, ఆన్ లైన్ మనీ ట్రాన్ఫర్లపై 5 శాతం పన్ను కట్టాల్సిందేనని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

అయితే తాము పంపే డబ్బుపై 5 శాతం పన్ను మరింత భారంగా ఉంటుందని చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో దానిని 1 శాతానికి పరిమితం చేస్తున్నట్లు శుభవార్త రావటంపై అమెరికాలోని భారతీయులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే అమెరికా బ్యాంక్ ఖాతాల నుంచి చేసే చెల్లింపులు, డెబిట్ కార్డ్ చెల్లింపులు, క్రెడిట్ కార్డ్ చెల్లింపులు దీని నుంచి మినహాయింపును పొందుతాయని వెల్లడైంది. దీంతో తమ దేశాలకు డబ్బును పంపటం తక్కువ ఖర్చుతో పూర్తి చేసుకోవచ్చని అమెరికాలోని విదేశీయులు చెబుతున్నారు.

ALSO READ | IPO News: మార్కెట్లో ఐపీవోల కోలాహలం.. 4 ఐపీవోలకు డబ్బు రెడీ చేస్కోండి, వివరాలివే..

ప్రధానంగా అమెరికాలో నివసిస్తున్న భారత సంతతి ప్రజలు, ఇమ్మిగ్రెంట్ కమ్యూనిటీలు గతంలో తెచ్చిన 5 శాతం పన్ను రేటును వ్యతిరేకించటాన్ని అమెరికా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుందని నిపుణులు చెబుతున్నారు. భారతదేశం విషయానికి వస్తే ప్రతి ఏటా ప్రవాస భారతీయులు అమెరికాలో సంపాదించిన దాని నుంచి తమ ప్రియమైన వారికి, ఫ్యామిలీకి అక్షరాలా రూ.7 లక్షల కోట్ల వరకు పంపిస్తూ ఉంటారు. ట్రంప్ చర్యల కారణంగా ఇకపై ఇండియాకు అమెరికాలో నివసిస్తున్న భారతీయుల నుంచే వచ్చే డబ్బు తగ్గిపోతుందని అంచనా వేయబడింది. అమెరికా నుంచి పంపే ప్రతి రూ.లక్షలో రూ.వెయ్యి పన్ను రూపంలో కట్ అవనుంది.