IPO News: మార్కెట్లో ఐపీవోల కోలాహలం.. 4 ఐపీవోలకు డబ్బు రెడీ చేస్కోండి, వివరాలివే..

IPO News: మార్కెట్లో ఐపీవోల కోలాహలం.. 4 ఐపీవోలకు డబ్బు రెడీ చేస్కోండి, వివరాలివే..

భారత క్యాపిటల్ మార్కెట్లో ఐపీవోల జోరు కొనసాగుతోంది. దాదాపు ఆరు నెలల గ్యాప్ తర్వాత తిరిగి వరుస ఐపీవోల రాక ఇన్వెస్టర్లకు ఆనందాన్ని కలిగిస్తోంది. ఈక్విటీల కంటే ఐపీవోలపై బెట్టింగ్ వేయటం ఇటీవలి కాలంలో భారీగా పెరగటంతో ఇన్వెస్టర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఈ మార్గాన్ని ప్రధానంగా ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో సెబీ వద్ద ఐపీవో పత్రాలు సమర్పించిన కంపెనీల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

ఫుడ్‌లింక్ F&B హోల్డింగ్స్:
కేటరింగ్, ఫుడ్ రిటైల్ చెయిన్ కంపెనీ ఫుడ్‌లింక్ F&B హోల్డింగ్స్ (ఇండియా) తన ఐపీవోను ఫ్లోట్ చేసేందుకు సెబీకి పత్రాలు సమర్పించింది. ఈ ఐపీవో ద్వారా కంపెనీ దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.160 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడైంది. అయితే ఇందులో తాజా ఈక్విటీతో పాటు ఆఫర్ ఫర్ సేల్ కూడా ఉండనుంది. సమీకరించిన డబ్బును కంపెనీ కొత్త సెంట్రలైజ్డ్ కిచెన్లు, ఫుడ్‌లింక్ గ్లోబల్ రెస్టారెంట్స్ & కేటరింగ్ సర్వీసెస్ కోసం క్యాజువల్ డైనింగ్ రెస్టారెంట్లు స్టార్ట్ చేయాలని నిర్ణయించింది. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీ మెయిన్ బోర్డ్ ఐపీవోగా రాబోతోంది.

క్యూర్‌ఫుడ్స్ ఇండియా:
ఇంటర్నెట్ ఆధారిత మల్టీ-బ్రాండ్ ఫుడ్ సేవల కంపెనీ క్యూర్‌ఫుడ్స్ ఇండియా లిమిటెడ్ తన ఐపీవో కోసం డ్రాఫ్ట్ పేపర్లను సెబీకి అప్పగించింది. 2024 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం పరంగా ఇది రెండో అతి పెద్ద డిజిటల్ ఫస్ట్ ఫుడ్ సేవల సంస్థగా ఇది నిలిచింది. కంపెనీ తాజా ఐపీవో ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.800 కోట్లను సమీకరించాలని చూస్తోంది. కంపెనీ ఈ నిధులను వ్యాపార విస్తరణకు వినియోగించనుంది. ప్రస్తుతం కంపెనీ దేశవ్యాప్తంగా ఈట్‌ఫిట్, కేక్‌జోన్, ఓలియో పిజ్జా వంటి బ్రాండ్ల ద్వారా వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. 

అమీర్‌చంద్ జగదీష్ కుమార్:
బాస్మతి బియ్యం, ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల ప్రాసెసింగ్, ఎగుమతి వ్యాపారం నడుపుతున్న అమీర్‌చంద్ జగదీష్ కుమార్ (ఎక్స్‌పోర్ట్స్) లిమిటెడ్ తన ఐపీవో పత్రాలను సెబీకి సమర్పించింది. ఈ సంస్థ తాజా ఐపీవో ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.550 కోట్లను సమీకరించే లక్ష్యంతో ముందుకొస్తోంది. బాస్మతి బియ్యం పరిశ్రమలో సంస్థ 40 ఏళ్లకు పైగా సుదీర్ఘ ప్రస్థానాన్ని కలిగి ఉంది. ఆదాయాల పరంగా కంపెనీ మూడవ అతిపెద్ద సంస్థగా కొనసాగుతోంది. కంపెనీ తన ఉత్పత్తులను ఏరోప్లేన్ బ్రాండ్ పేరుతో మార్కెటింగ్ చేస్తోంది. అలాగే ఇతర బ్రాండ్ పేర్ల కింద ఆటా, మైదా, సుజీ, సాల్ట్ వంటి ఉత్పత్తులను కూడా విక్రయిస్తోంది. 

జునిపర్ గ్రీన్ ఎనర్జీ:
ఇక రెన్యూవబుల్ ఎనర్జీ రంగానికి చెందిన జునిపర్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ కూడా సెబీ వద్ద తమ ఐపీవో పేపర్స్ సబ్మిట్ చేసింది. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.3వేల కోట్లు సమీకరించాలని ప్లాన్ చేస్తోంది. అయితే ఇది పూర్తిగా తాజా ఈక్విటీ ఇష్యూ కలిగి ఉండనుందని సమాచారం. కంపెనీ నిధుల్లో ఎక్కువ మెుత్తాన్ని రుణ చెల్లింపులకు వినియోగించాలని నిర్ణయించింది. కంపెనీ సోలార్, విండ్ ఎనర్జీ ఉత్పత్తిలో ఉండగా సామర్థ్యం పరంగా దేశంలోని టాప్ 10 సంస్థల్లో ఒకటిగా గుర్తింపును సంపాదించుకుంది. 2025 మే 31 నాటికి మొత్తం సామర్థ్యం 7,898.45 మెగావాట్లకు చేరుకుంది. 

ALSO READ | సిగాచి కెమికల్ పరిశ్రమలో ప్రమాదం.. 14 శాతం కుప్పకూలిన స్టాక్..