సిగాచి కెమికల్ పరిశ్రమలో ప్రమాదం.. 14 శాతం కుప్పకూలిన స్టాక్..

సిగాచి కెమికల్ పరిశ్రమలో ప్రమాదం.. 14 శాతం కుప్పకూలిన స్టాక్..

Sigachi Industry Stock: తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పాసమైలారంలోని ఫేజ్-1 ప్రాంతంలో ఉన్న సిగాచి ఇండస్ట్రీ యూనిట్ లో పెద్ద ప్రమాదం చోటుచేసుకుంది. వాస్తవానికి పరిశ్రమలోని ఎయిర్ డ్రయ్యర్ లో అధిక పీడనం వల్ల జరిగిన పేలుడులో దాదాపు 12 మంది మరణించారు. దాదాపు 40 మంది గాయాలపాలయ్యారు. అయితే ప్రమాద సమయంలో లోపలే చిక్కుకున్న కార్మికుల కోసం రెస్క్యూ బృందాలు ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. మరోపక్క అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. మృతుల బంధువులకు 2 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా, గాయపడిన వారికి 50 వేల రూపాయల పరిహారాన్ని ప్రకటించారు.

ALSO READ | పేలింది రియాక్టర్ కాదు..ఎయిర్ డ్రయర్ ప్రెజర్ వల్లే యాక్సిడెంట్ : కార్మికశాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి

ఈ వార్త బయటకు రావటంతో ఒక్కసారిగా సిగాచి ఇండస్ట్రీస్ కంపెనీ షేర్లు ఇంట్రాడేలో 14 శాతం మేర కుప్పకూలాయి. సాయంత్రం మార్కెట్ల ముగింపు సమయంలో స్టాక్ ఒక్కోటి రూ.48.95 రేటు వద్ద స్థిరపడ్డాయి. అయితే ప్రమాదానికి ముందు కంపెనీ షేర్లు ఇంట్రాడేలో అత్యధికంగా ఒక్కోటి రూ.56.03ని తాకాయి. అలాగే కంపెనీ షేర్ల 52 వారాల గరిష్ఠ ధర రూ.70కి దగ్గరగా ఉంది. 

ప్రస్తుతం ప్రమాదంలో గాయపడిన వ్యక్తులకు అత్యుత్తమ వైద్య సేవలను అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఘటనా స్థలానికి కార్మిక మంత్రి వివేక్ స్వయంగా వెళ్లి ప్రమాదానికి గల కారణాలు, సహాయక చర్యలను పర్యవేక్షించారు. అలాగే ప్రమాదంలో శిధిలాల కింద చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. ఉదయం 9:37 గంటలకు అగ్ని ప్రమాద హెచ్చరిక అందింది, దీనితో పటాన్‌చెరు, సంగారెడ్డి, కూకట్‌పల్లి, మాదాపూర్, జీడిమెట్ల , రాజేంద్రనగర్‌ స్టేషన్ల నుంచి 11 అగ్నిమాపక వాహనాలు రంగంలోకి దిగి మంటలను అదుపుచేసే పనిలో నిమగ్నమయ్యాయి. 

కంపెనీ వ్యాపారం..
1989లో స్థాపించబడిన సిగాచి ఇండస్ట్రీస్, మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ పౌడర్ ప్రధాన ఉత్పత్తి, పంపిణీదారుల్లో ఒకటిగా ఉంది. ఈ కంపెనీకి ప్రస్తుతం హైదరాబాద్, గుజరాత్‌లలో రెండు అత్యాధునిక ఉత్పత్తి ఫ్యాక్టరీలు ఉన్నాయి.  సిగాచి ఇండస్ట్రీస్ ఫార్మా ఎక్సిపియెంట్స్ న్యూట్రా, ఆహార పదార్థాల రంగంలో కూడా అగ్రగామిగా ఉంది.