
సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 12 కు చేరింది. 26 మంది గాయపడ్డట్లు సమాచారం. ఈ క్రమంలో ఘటనాస్థలిని పరిశీలించిన కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రమాదం రియాక్టర్ పేలుడు వల్ల జరగలేదని.. ఎయిర్ డ్రయర్ ప్రెజర్ వల్లే జరిగిందని స్పష్టం చేశారు. ఈ ఘటనపై రాజకీయం చేయద్దని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఘటన జరిగిన తర్వాత 15 నిమిషాల్లోనే కలెక్టర్, ఎస్పీ ఇక్కడకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారని అన్నారు.
ఆదికారులంతా వెంటనే అప్రమత్తమై క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని అన్నారు. 12 మంది పరిస్థితి విషమంగా ఉందని.. మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు మంత్రి వివేక్. మిగతా 22 మందికి స్వల్ప గాయాలున్నాయని.. వారు త్వరగా కోలుకుంటారని అధికారులు తెలిపారని వెల్లడించారు. ఇప్పటిదాకా 12 మంది మృతి చెందారని.. వ్యర్థాలు క్లియర్ చేశాక మృతులకు సంబందించిన కరెక్ట్ నంబర్ తెలుస్తుందని అన్నారు. ఎయిర్ డ్రైయర్ ప్రెజర్ వల్లే ప్రమాదం జరిగిందని స్పష్టం చేశారు.
ఘటనకు కారణాలేంటన్నది పరిశీలిస్తున్నామని.. విచారణ జరిపి ఘటనకు బాద్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు మంత్రి వివేక్. ఫ్యాక్టరీ యాజమాన్యంతో మాట్లాడి కార్మికులకు అందాల్సిన ఎక్స్ గ్రేషియా అందిస్తామని.. ప్రభుత్వం తరపున కూడా చేయగలిగినంత చేసి కార్మికులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు మంత్రి వివేక్.
ఘటనాస్థలిని పరిశీలించిన మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ 3 గంటలుగా రెస్క్యూ పనులను పరిశీలిస్తున్నామని.. ఘటన జరగడం బాధాకరమని అన్నారు. ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించిందని.. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉందని అన్నారు. ఘటన జరిగినప్పుడు 90 మంది పనిచేస్తున్నారని అన్నారు. భవనం శిధిలాల కింద ఇంకొంతమంది ఉన్నట్లు తెలుస్తోందని అన్నారు. చనిపోయినవారి వివరాలు కాసేపట్లో ప్రకటిస్తామని అన్నారు. ఘటనపై రాజకీయం చేయద్దని అన్నారు మంత్రి దామోదర రాజనర్సింహ.