ఫేక్ సర్టిఫికెట్స్ తో యూఎస్ వెళ్లిన స్టూడెంట్.. అక్కడ తరిమేస్తే.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరెస్ట్..

ఫేక్ సర్టిఫికెట్స్ తో యూఎస్ వెళ్లిన స్టూడెంట్.. అక్కడ తరిమేస్తే.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో అరెస్ట్..

రెండవసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డోనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే.. అమెరికా ఫస్ట్ నినాదంతో ఎన్నికల్లో గెలుపొందిన ట్రంప్.. అన్నట్టుగానే ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తున్నారు. ముఖ్యంగా అమెరికాలో చదువుకోవడానికి వెళ్లిన స్టూడెంట్స్ ట్రంప్ వరుస సంచలన నిర్ణయాలతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారనే చెప్పాలి. ఫేక్ సర్టిఫికెట్స్ యూఎస్ వెళ్లి.. అక్కడ బహిష్కరణకు గురైన ఓ స్టూడెంట్ ను  అరెస్ట్ చేశారు శంషాబాద్ పోలీసులు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి...

నల్గొండకు చెందిన గోపాల్ రెడ్డి అనే స్టూడెంట్ వీసా కోసం ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్స్ ఇచ్చి అమెరికా వెళ్ళాడు.అమెరికాలోని మిస్సోరిలో ఉన్న వెబ్స్టర్ యూనివర్సిటీలో మాస్టర్స్ జాయిన్ అయ్యాడు గోపాల్ రెడ్డి.  తాజాగా ఇమ్మిగ్రేషన్ అధికారులు నిర్వహించిన వెరిఫికేషన్ లో గోపాల్ రెడ్డి నకిలీ సర్టిఫికెట్స్ బాగోతం బయట పడటంతో అతన్ని వెనక్కు పంపారు అధికారులు.

గోపాల్ రెడ్డి మదురై కామరాజు యూనివర్సిటీ నుంచి ఫేక్ బీఎస్సీ కంప్యూటర్స్ డిగ్రీ పొందినట్లు ఫేక్ సర్టిఫికెట్ సృష్టించినట్లు అధికారుల విచారణలో తేలింది. దీంతో జూన్ 1న శంషాబాద్ ఎయిర్ పోర్టుకి వచ్చిన గోపాల్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గోపాల్ యూస్ వెళ్లిన 15 నెలల తర్వాత 2024లో ఇండియాకు వెళ్లినట్లు తెలుస్తోంది. అమెరికాకు తిరిగి వెళ్లే సమయంలో డల్లాస్ ఎయిర్ పోర్టులో  ఇమ్మిగ్రేషన్ అధికారులు గోపాల్ ను అడ్డుకొని వెనక్కు పంపినట్లు తెలుస్తోంది.

ధనలక్ష్మి ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ కి చెందిన కాటోజు అశోక్ తనకు నకిలీ సర్టిఫికెట్స్ ఇచ్చాడని తెలిపాడు గోపాల్. దీంతో అశోక్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 2020 నుంచి అశోక్ నకిలీ సర్టిఫికెట్స్ దందా చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు.. ఇప్పటికి దాకా 15 మందిని ఫేక్ సర్టిఫికెట్స్ తో అమెరికాకు పంపాడని.. ఒక్కొక్కరి నుంచి రూ. 80 వేల నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేసినట్లు గుర్తించారు పోలీసులు.