Telangana Food : మురుకులు బోలెడు వైరటీలు.. స్కూల్స్ ఓపెన్ అయ్యాయి కదా.. పిల్లలకు స్నాక్స్ కింద బాగుంటాయి..!

Telangana Food : మురుకులు బోలెడు వైరటీలు.. స్కూల్స్ ఓపెన్ అయ్యాయి కదా.. పిల్లలకు స్నాక్స్ కింద బాగుంటాయి..!

ఏ పండుగొచ్చినా.. సెలవులొచ్చినా.. ఇంట్లో తప్పకుండా చేసే పిండి వంట 'మురుకులు'. వీటిని అన్ని రాష్ట్రాల్లో చేసుకుంటారు. ముఖ్యంగా తెలంగాణలో మురుకులు మాత్రం కచ్చితంగా చేస్తారు. పిల్లలకి సెలవులొచ్చినయ్ అంటే.. తల్లులు చేసే పిండి వంట ఇది. మురుకుల్లో కూడా బోలెడన్ని వెరైటీలు చేయొచ్చు.  ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. . 

నువ్వులతో  మురుకులు తయారీకి కావలసినవి

  •  మైదాపిండి- ఒకటిన్నర కప్పు 
  • వెన్న- రెండు టీ స్పూన్లు 
  • నువ్వులు- ఒకటిన్నర టీ స్పూన్
  •  ఉప్పు-తగినంత
  • కారం- కొద్దిగా
  • నూనె-సరిపడా 

తయారీ: స్టవ్ పై గిన్నెలో కాటన్ క్లాత్ వేసి, దానిపై మైదాపిండి పోయాలి. సన్నని మంటపై పది నిమిషాలు వేడి చేయాలి. తర్వాత పిండి చల్లారాక అందులో వెన్న, నువ్వులు, ఉప్పు, కారం, సరిపడా వేడి నీళ్లు పోసి స్పూన్తో కలపాలి. పిండి చల్లారాక చేత్తో ముద్దగా కలపాలి. పది నిమిషాలు పిండిని పక్క నబెట్టాలి. ఆపైన పిండిని కొద్దికొద్దిగా మురుకుల గిద్దెలో పెట్టి వత్తాలి (స్టార్ బిళ్ల వాడాలి). వాటిని నూనెలో డీప్ ఫ్రై చేయాలి. అంతే, కరకరలాడే మైదా ముల్లు మురుకులు రెడీ. 

 పుట్నాల పప్పుతో మురుకులు తయారీకి కావలసినవి 

  •   బియ్యప్పిండి- ఒక కప్పు
  • పుట్నాలు-మూడు టేబుల్ స్పూన్లు
  •  వెన్న- అర టేబుల్ స్పూన్
  •  కారం- కొద్దిగా
  • జీలకర్ర - ఒక టీ స్పూన్
  •  ఉప్పు-తగినంత
  • నూనె - సరిపడా

తయారీ: పుట్నాలను మిక్సీలో గ్రైండ్ చేయాలి. బియ్యప్పిండిలో పుట్నాల పొడి, కారం, జీలకర్ర, వెన్న, ఉప్పు వేసి బాగా కలపాలి. అందులో సరిపడా వేడి నీళ్లు పోసి స్పూన్ తో కలపాలి (చేతులతో కలిపితే కాలుతుంది). పిండి పూర్తిగా చల్లారాక చేత్తోబాగా కలిపి ముద్ద చేయాలి. దాన్ని మురుకుల గిద్దెలో పెట్టి వత్తాలి. తర్వాత వాటిని నూనెలో డీప్ ఫ్రై చేయాలి

ఆలూతో మురుకుల తయారీకి కావలసినవి  

  • బియ్యప్పిండి- ఒక కప్పు
  • ఆలుగడ్డ (మీడియం సైజు)-ఒకటి
  • వెన్న- ఒక టేబుల్ స్పూన్
  •  జీలకర్ర- ముప్పావు టీ స్పూన్ 
  • పసుపు - చిటికెడు
  • కారం- కొద్దిగా
  • ఉప్పు- తగినంత
  • నూనె- సరిపడా 

తయారీ: ఆలుగడ్డను ఉడికించి పొట్టు తీసి మెదపాలి. ఒక గిన్నెలో బియ్యప్పిం డి, ఆలుగడ్డ ముద్ద, వెన్న, జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు, సరిపడా నీళ్లు పోసి బాగా కలపాలి. దాన్ని కొద్దికొద్దిగా మురుకుల గిద్దెలో పెట్టి ప్లేట్ లేదా పేపర్​పై వత్తాలి. వాటిని మరుగుతున్న నూనెలో డీప్ ఫ్రై చేయాలి. ఈ మురుకులు ఇరవై రోజులదాకా తాజాగా ఉంటాయి. 

ఆటా చక్లీ తో మురుకుల తయారీకి కావలసినవి  

 

  •  గోధుమపిండి (ఆటా)- రెండు కప్పులు
  • బియ్యప్పిండి- పావు కప్పు
  • జీలకర్ర - ఒక టీ స్పూన్
  •  పసుపు- పావు టీ స్పూన్
  • కారం- ఒక టీ స్పూన్
  •  ఇంగువ - చిటికెడు
  • ఉప్పు తగినంత
  •  నూనె- సరిపడా 

తయారీ: ఒక కాటన్ క్లాత్​ లో  గోధుమపిండి, బియ్యప్పిండి వేసి కలపాలి. దాన్ని కుక్కర్లో పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు స్టీమ్ చేయాలి. తర్వాత ఉండలు కట్టిన పిండిని పొడిగా చేయాలి. తర్వాత పిండిలో జీలకర్ర, పసుపు, ఉప్పు, కారం, ఇంగువ, అర కప్పు నీళ్లు పోసి బాగా కలపాలి. పిండి మెత్తగయ్యాక కొద్దికొద్దిగా మురుకుల గిద్దెలో పెట్టి గుండ్రంగా వత్తాలి. వీటిని వేడివేడి నూనెలో డీప్ ఫ్రై చేయాలి. గాలి దూరని డబ్బాలో నిల్వ చేస్తే రెండు వారాల వరకు తాజాగా ఉంటాయి.

-–వెలుగు,లైఫ్​–