సిటీ నెట్వర్క్, వెలుగు: శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు గ్రేటర్లో ఆదివారం ఘనంగా జరిగాయి. వాసవి మాత జయంతిని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన నేపథ్యంలో రవీంద్రభారతిలో తొలిసారి భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రధాన వేడుకల్లో ఎమ్మెల్సీ బొగ్గరపు దయానంద గుప్త, టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఉప్పల శ్రీనివాస్ పాల్గొన్నారు.
లోక కల్యాణం కోసమే వాసవి మాత ఉద్భవించారని, అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆకాంక్షించారు. వాసవి మాత జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ఈ సందర్భంగా ఆర్యవైశ్యుల కృతజ్ఞతలు తెలిపారు. సికింద్రాబాద్ ఆవులమంద ఆలయంలో జరిగిన వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆర్యవైశ్యుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. రాంగోపాల్పేటలో జరిగిన శోభాయాత్రలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొనగా, ఉప్పల్లోని వాసవీ మాత ఆలయంలో మాజీ కార్పొరేటర్ మందుముల రజిత పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో పుష్పాభిషేకాలు, క్రతువులు భక్తిశ్రద్ధలతో జరిగాయి. -

