కరీంనగర్ రోడ్లపై రాత్రిపూట ఓ మందుబాబు చేసిన వీరంగం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న పోలీసులకు ఆటో డ్రైవర్ చుక్కలు చూపించాడు. మద్యం మత్తులో ఊగిపోతూ విచిత్రమైన వాదనలతో హల్చల్ చేశాడు.
తాగిన మైకంలో ఆటో నడుపుతూ పట్టుబడిన ఆ డ్రైవర్ని పోలీసులు ప్రశ్నించగా.. ఆయన చెప్పిన సమాధానాలు విని ఖాకీలే అవాక్కయ్యారు. నేను నా చెల్లి కోసం తాగాను.. తప్పుచేశానా? అంటూ పోలీసులతోనే వాగ్వివాదానికి దిగాడు. అంతేకాదు.. ఈ సమాజం ఏమైనా బాగుందా? నాలాంటి వాళ్లనే పట్టుకుంటారు అంటూ ఎదురు ప్రశ్నించి హైడ్రామా సృష్టించాడు.
ఇక పోలీసులు అతనికి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయగా.. మీటర్లో ఆల్కహాల్ రీడింగ్ ఏకంగా 154గా నమోదైంది. మోతాదుకు మించి మద్యం తాగి, ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఆటో నడిపిన ఆ మందుబాబు నిర్వాకంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేశారు.
