
- కొత్త ప్రభుత్వం జీవో 45ను రద్దు చేయాలి
- బహుజన స్టూడెంట్ ఫెడరేషన్
సికింద్రాబాద్, వెలుగు: బీఆర్ఎస్ పాలనలో యూనివర్సిటీలతో పాటు ఉన్నత విద్యను సర్వనాశనం చేసిందని బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వేల్పుల సంజయ్ ఆరోపించారు. జీవో నంబర్.45ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కాలేజీ వరకు విద్యార్థులతో ర్యాలీ చేపట్టారు.
అనంతరం వేల్పుల సంజయ్ మాట్లాడుతూ.. కొత్త ప్రభుత్వ ఏర్పాటు నిరుద్యోగుల విజయమని పేర్కొన్నారు. తక్షణమే గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్.45ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితిని 58 నుంచి 61 ఏళ్లకు పెంచడం సరికాదని, దీంతో నిరుద్యోగులకు, ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. టీఎస్పీఎస్సీ గ్రూప్ –4 ఉద్యోగాలను అటానమస్ బాడీ కలిగిన యూని వర్సిటీలకు అప్పగించాలని కోరారు.
కార్యక్రమంలో బహుజన విద్యార్థి సంఘాల నేతలు జంగిలి దర్శన్ డీఎస్ఏ స్టేట్ కో–ఆర్డినేటర్, ఎస్ఎఫ్ ఓయూ అధ్యక్షుడు అంబేద్కర్, బీఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పులిగంటి వేణుగోపాల్, భాస్కర్, కృష్ణ, విజయ్, సంతోష్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.