జూబ్లీహిల్స్‌ లో కొలువైన వెంకన్న

జూబ్లీహిల్స్‌ లో కొలువైన వెంకన్న

వెలుగు: జూబ్లీహిల్స్ లోని తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో…. విగ్రహ ప్రతిష్ఠ, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈనెల 9వ తేదీన ప్రారంభమైన కార్యక్రమాలు బుధవారం ముగిశాయి. బుధవారం ఉదయం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు సుప్రభాతం, కుంభారాధన నివేదన, హోమం, మహా పూర్ణా హుతి నిర్వహించారు. ఉదయం 5.30 గంటల నుంచి 6 గంటల వరకు కుంభాలను, ఉత్సవమూర్తులను ఊరేగించారు. 6 గంటల నుండి 7.30 గంటల నడుమ మీన లగ్నంలో మహా కుంభాభిషేకం నిర్వహించారు. అనంతరం 7.30 నుంచి 9 గంటల వరకు బ్రహ్మఘోష, ధ్వజారోహణం, అర్చక బహుమానం కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం 9 గంటల నుంచి 10.30 గంటల వరకు నిత్య కైంకర్యాలు నిర్వహించారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు భక్తులకు సర్వ దర్శనం కల్పించారు. సాయంత్రం 4 గంటల నుంచి 5.30 గంటల వరకు శ్రీనివాస కల్యాణం, 5.30గంటల నుంచి 6.30 గంటల వరకు స్వామివారి ఊరేగింపు, ధ్వజావరోహణం… సాయంత్రం 6.30 గంటల నుంచి 7.30 గంటల వరకు నిత్య కైంకర్యాలు, రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు సర్వ దర్శనం కల్పించారు. రాత్రి 8.45 గంటలకు ఏకాంత సేవ నిర్వహించారు.

ఈ కార్యక్రమాల్లో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, టీటీడీ తిరుపతి జేఈవో బి.లక్ష్మీకాంతం, తిరుమల జేఈవో కె.ఎస్.శ్రీనివాసరాజు, సీవీఎస్ వో గోపీనాథ్ జెట్టీ, ధర్మకర్తల మండలి సభ్యులు రుద్రరాజు పద్మరాజు, రమేశ్ బాబు, ప్రత్యేక ఆహ్వానితులు రాఘవేంద్రరావు, స్థానిక సలహా మండలి అధ్యక్షులు బి.అశోక్ రెడ్డి, సభ్యులు పి.రామకృష్ణ, పి.బాలరాజు గౌడ్, డి.కృష్ణమోహన్, వై.త్రినాథ్ బాబు, రామిరెడ్డి, ఎస్.ఈ. ఎ.రాములు, డిప్యూటీ ఈవో పి.విశ్వనాథం, ఎఈవో జగన్ మోహన్ రాజు, తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ శేషాద్రి, బొక్కసం బాధ్యులు గురు రాజారావు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఉదయం నుంచి నిర్విరామంగా సాగిన కార్యక్రమాలతో ఆలయంలో ఆధ్యాత్మి క వాతావరణం వెల్లివిరిసింది.