రూ.31 లక్షల విలువైన నకిలీ విత్తనాలు స్వాధీనం

రూ.31 లక్షల విలువైన నకిలీ విత్తనాలు స్వాధీనం

రంగారెడ్డి జిల్లా ‌మేడ్చల్‌ మండలం కండ్లకోయలో భారీగా నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు విజిలెన్స్ అధికారులు. కండ్ల‌కోయ‌లోని ఎకో ఆగ్రో సీడ్స్ గోదాముపై విజిలెన్స్‌ అధికారులు బుధవారం దాడులు చేశారు. ఈ దాడుల్లో రూ.31 లక్షల విలువైన భారీ నకిలీ విత్తనాలతో పాటు, పొద్దు తిరుగుడు, మొక్కజొన్న, జొన్న విత్తనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న విత్తనాల ప్యాకెట్లపై టెస్టింగ్‌ చేసిన తేదీ, ప్యాకింగ్ చేసిన తేదీల్లో వ్యత్యాసం ఉందని తెలిపారు. సరైన పరీక్షలు నిర్వహించకుండా విత్తనాల విక్రయిస్తున్నారని విజిలెన్స్ అధికారులు పేర్కొన్నారు.

ఈ దాడుల్లో రూ.12.24 లక్షల విలువైన 1529 మొక్క జొన్న విత్తనాల ప్యాకెట్లను, రూ.18. 76లక్షల విలువైన 1210 పొద్దు తిరుగుడు విత్తనాల ప్యాకెట్లను అధికారులు స్వాదీనం చేసుకున్నారు. నకిలీ విత్తనాలతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోతారని అధికారులు అన్నారు. సీజ్ చేసిన విత్తనాలను స్థానిక వ్యవసాయ అధికారికి అప్పగించి, వారిపై విత్తన చట్టం, ఐ.పీ.సీ సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.