
- రద్దీ ప్రాంతాల్లో పర్మిషన్ ఇవ్వం : సీఈవో వికాస్ రాజ్
- రూ.50వేల కంటే ఎక్కువ నగదు క్యారీ చేస్తే డాక్యుమెంట్లు చూపించాల్సిందే
- రాష్ట్ర వ్యాప్తంగా 3.30 కోట్ల మంది ఓటర్లు
- 85 ఏండ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు హోం ఓటింగ్
- ఏప్రిల్ 22లోపు దరఖాస్తు చేసుకోవాలని వెల్లడి
హైదరాబాద్, వెలుగు : పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హాలిడేస్ లోనే రోడ్ షోలకు అనుమతి ఉంటుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ స్పష్టం చేశారు. రద్దీ ప్రాంతాల్లో, మార్కెట్ జరిగే ఏరియాల్లో పర్మిషన్ ఉండదన్నారు. అదేవిధంగా, పీక్ అవర్స్లో కూడా రోడ్ షోకు అనుమతివ్వమని తేల్చి చెప్పారు. ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం.. రోడ్ షోకు ముందస్తు అనుమతి కచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
లేకపోతే ఈసీ నిబంధనల ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. సోమవారం బీఆర్కే భవన్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఎన్నికల ఏర్పాట్లు, సిబ్బంది తదితర వివరాలను వికాస్ రాజ్ వెల్లడించారు. ‘‘రాష్ట్రంలో కార్పొరేషన్ చైర్పర్సన్ పోస్టుల నియామకం, పదవీ బాధ్యతలకు సంబంధించిన విషయం ఇంకా మా దృష్టికి రాలేదు. అలాంటిదేమైనా ఉంటే చెక్ చేసి ఈసీ ఆదేశాలకు అనుగుణంగా క్లారిటీ ఇస్తాం.
లోక్సభ ఎన్నికల కోసం అధికారులను అన్ని విధాలుగా సిద్ధం చేశాం. ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్స్ జరిగేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రచార ర్యాలీలు, రోడ్షోలకు ముందస్తు అనుమతి తీసుకోవాలి. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల దాకా ఎవరూ లౌడ్ స్పీకర్లు వాడొద్దు. 24 గంటలు పని చేసేలా ఇంటిగ్రేటెడ్ చెక్పోస్టులు ఏర్పాటు చేశాం. రూ.50వేల కంటే ఎక్కువ నగదు క్యారీ చేస్తుంటే.. వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు చూపించాల్సి ఉంటుంది. లేదంటే డబ్బులు సీజ్ చేస్తాం’’అని స్పష్టం చేశారు.
కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
ఓటర్లు ఏమైనా కంప్లైంట్లు చేయాలనుకుంటే.. విజిల్ యాప్ లేదా 1950కి కాల్ చేయాలని సీఈవో వికాస్ రాజ్ సూచించారు. ఎన్నికల ప్రచారంలో చిన్న పిల్లలను భాగస్వాములను చేయొద్దన్నారు. స్కూల్ యూనిఫాంలతో పిల్లలను పార్టీ కార్యక్రమాల్లో అటెండ్ చేయించడానికి అనుమతి లేదని తెలిపారు. ‘‘రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. కోడ్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలున్నాయి. ఏరియాపరంగా చూసుకుంటే హైదరాబాద్ చిన్న నియోజకవర్గం. ఆదిలాబాద్ పెద్ద నియోజకవర్గం. అదే ఓటర్ల పరంగా చూసుకుంటే.. మహబూబాబాద్ చిన్న సెగ్మెంట్. మల్కాజిగిరి పెద్దది. రాష్ట్రంలో మొత్తం 3.30 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 85 ఏండ్లు దాటిన వృద్ధులు 1.94 లక్షల మంది ఉన్నారు. దివ్యాంగ ఓటర్లు 5.26 లక్షల మంది ఉన్నరు. వీళ్లు ఇంటి నుంచే ఓటేయొచ్చు. దీని కోసం ఏప్రిల్ 22లోపు దరఖాస్తు చేసుకోవాలి. నామినేషన్ల ఉప సంహరణ గడువు ముగిసిన తర్వాత 3, 4 రోజుల్లో హోమ్ ఓటింగ్ నిర్వహిస్తాం’’అని స్పష్టం చేశారు.
35 వేలకు పైగా పోలింగ్ స్టేషన్లు
పోలింగ్ కేంద్రాల్లో 1.8 లక్షల మంది సిబ్బంది అవసరం అవుతారని సీఈవో వికాస్ రాజ్ స్పష్టం చేశారు. అదనంగా మరో 25వేల మంది సిబ్బంది కూడా ఎన్నికల విధుల్లో పాల్గొంటారని వివరించారు. 40వేల మంది బీఎల్వోలు, సూపర్వైజర్లు పని చేస్తారని వెల్లడించారు. పోలింగ్ విధుల్లో కేంద్ర బలగాలతో పాటు 60వేల మంది పోలీసు సిబ్బంది, 19 నుంచి 20 ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు ఉంటాయని స్పష్టం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా 35,356 పోలింగ్ స్టేషన్లు ఉండగా.. వీటిలో 9వేల కేంద్రాలు సమస్యాత్మకమైనవిగా గుర్తించాం. లోక్సభ ఎన్నికల కోసం 48వేల వీవీ ప్యాట్లు అవసరం అవుతాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బై ఎలక్షన్కు 500 ఈవీఎంలు, 500 వీవీ ప్యాట్లు కావాలి. సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశాం’’అని తెలిపారు.
8 లక్షల బోగస్ ఓట్లు తొలగించాం
గతేడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత 12 లక్షల ఓట్లు కొత్తగా యాడ్ అయినట్టు సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. అదేవిధంగా.. 8,58,491 ఓట్లు తొలగించామని తెలిపారు. మరో 7 లక్షల ఓటర్ల వివరాల్లో కరెక్షన్స్ చేశామని చెప్పారు. ‘‘ఫిర్యాదులు, అధికారుల విచారణ తర్వాత బోగస్ ఓట్లు తొలగించాం. ఈసారి పోస్టల్ ఓటింగ్కు ఇబ్బంది లేకుండా కొత్త సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్నాం.
గత పార్లమెంట్ ఎన్నికల్లో 62.72 శాతం ఓటింగ్ నమోదైంది. పోలింగ్ శాతం పెంచడంపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించాం. దీని కోసం ప్రణాళికబద్దంగా ముందుకు వెళ్తున్నాం. గతంలో 5వేల పోలింగ్ కేంద్రాల్లో తక్కువ ఓటింగ్ నమోదైనట్టు మా దృష్టిలో ఉంది. ఎండా కాలంలో ఎన్నికలు జరుగుతున్నందున.. ఓటర్లకు ఇబ్బందుల్లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం’’అని తెలిపారు.