
భోజన ప్రియుడైన బొజ్జ గణపయ్యకు...ఎన్ని ఫలహారాలు పెట్టినా తక్కువే.మరి వినాయక చవితి రోజు ( August 27) వివిధరకాల నైవేద్యాలు పెట్టాల్సిందేగా.అందుకే ఆయనకుఇష్టమైన, రుచికరమైన వంటలు ఈ పండుగకు ఇవి చేసి నైవేద్యంగా పెట్టండి. .
పాల ఉండ్రాళ్లు తయారీకి కావలసినవి:
బియ్యప్పిండి: 80 గ్రాములు
నీళ్లు: పావులీటర్
నెయ్యి/వెన్న:ఒక టేబుల్ స్పూన్
ఉప్పు: చిటికెడు పాలు అర లీటర్
చక్కెర :120 గ్రాములు
కొబ్బరితురుము: పావు కప్పు
యాలకుల పొడి:అరటీస్పూన్
తయారీ విధానం : బియ్యప్పిండి జల్లెడ పట్టాలి. ఒక వెడల్పాటి గిన్నెలో నీళ్లు పోసి.. గోరు వెచ్చగా కాగబెట్టాలి. నీళ్లలో చిటికెడు ఉప్పు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, వెన్న, బియ్యప్పిండి వేసి ఉండలు లేకుండా ముద్దలా చేయాలి. . పిండి చల్లారాక చిన్నచిన్న ఉండలు చేయాలి. మరో వెడల్పాటి గిన్నెలో పాలు మరగబెట్టాలి . ఆ పాలలో కొబ్బరి... యాలకుల పొడి... చక్కెర వేసి అది కరిగే వరకు కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత ఉండ్రాళ్లను కాగుతున్న పాలలో వేసి ఐదు నిమిషాలు సిమ్లో ఉడికించాలి. స్టవ్ ఆపేసి, పది నిమిషాలు గిన్నె కదిలించకుండా ఉంచితే ఉండ్రాళ్లు విరిగిపోవు.
ఉండ్రాళ్ల తాలింపు తయారీకి కావలసినవి
బియ్యప్పిండి: ఒక కప్పు
నీళ్లు :ఒక కప్పు
ఉప్పు: చిటికెడు
నెయ్యి: ఒక టీ స్పూన్
ఆవాలు: అర టీ స్పూన్
జీలకర్ర: అర టీ స్పూన్
మినప్పప్పు: ఒక్కటీ స్పూన్
శనగపప్పు: ఒక టీ స్పూన్
పచ్చిమిర్చి లేదా ఎండుమిర్చి: మూడు
కరివేపాకు: ఒక రెమ్మ
నూనె: సరిపడా
తయారీ విధానం : ఒక గిన్నెలో నీళ్లు పోసి వేడి చేయాలి.అందులో కొద్దిగా ఉప్పు, నెయ్యి వేసి మరిగించాలి. మంట తగ్గించి బియ్యప్పిండి వేస్తూ కలపాలి. నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఆ పిండిని ప్లేట్ లోకి తీసు ఇరబెట్టి ముద్దగా చేయాలి. దాంతో చిన్నచిన్న ఉండ్రాళ్లుగా చేయాలి. నూనె రాసిన ఇడ్లీ ప్లేట్ మీద వీటిని ఉంచి ఆవిరిపై ఉడికించాలి. తర్వాత స్టవ్ పై పాన్ పెట్టి నూనె వేడిచేయాలి. అందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శెనగపప్పు.పచ్చిమిర్చి లేదా ఎండుమిర్చి, కరివేపాకు వేయాలి. ఆ పోపుని ఉండ్రాళ్లలో వేసి కలపాలి. ఉండ్రాళ్ల పాయసంతోపాటు ఈ సారి ఉండ్రాళ్లతో తాలింపు ట్రై చేయండి.
పూర్ణం కుడుములు తయారీకి కావాల్సినవి:
శనగపప్పు: ముప్పావు కప్పు
బెల్లం తురుము: ఒక కప్పు
ఎండు కొబ్బరి తురుము: అర కప్పు
బియ్యప్పిండి: ఒకటిన్నర కప్పు
ఇలాచీ పొడి: ఒక టేబుల్ స్పూన్
ఉప్పు: చిటికెడు
నెయ్యి: సరిపడా
తయారీ విధానం: శెనగపప్పును శుభ్రంగా కడిగి కుక్కర్ లో ఒక విజిల్ వచ్చేవరకు ఉడికించాలి. కొద్దిసేపయ్యాక పప్పులో ఉన్ననీటిని పారబోసి పక్కనపెట్టాలి. స్టవ్ పై ఒక గిన్నె పెట్టి, అందులో బెల్లం తురుము, సరిపడా నీళ్లు పోసి పాకం పట్టాలి. ఈ మిశ్రమంలో ఉడికించిన శెనగపప్పు.. ఎండుకొబ్బరి తురుము ...ఇలాచీ పొడి ...వేసి నిమిషాలు ఉడికించాలి.మిశ్రమం గట్టి పడ్డాక ఆఫ్ చేయాలి అది చల్లారిన తర్వాత ఉండలుగా చేసి ఒక ప్లేట్ లో వేయాలి. తర్వాత మరో గిన్నెలో కొద్దిగా నెయ్యి ఉప్పు, బియ్యప్పిండి మరియు గోరువెచ్చని నీళ్లు పోసి కలపాలి. చేతికి నూనె రాసుకుని బియ్యప్పిండి మిశ్రమాన్ని పల్చటి బిళ్లలుగా వత్తి మధ్యలో శెనగపప్పు ఉండల్ని పెట్టి గుండ్రంగా చేయాలి. నూనె లేదా నెయ్యి రాసిన ఇడ్లీ ప్లేట్లలో ఈ కుడుములను పెట్టి పదిహేను నిమిషాలు ఆవిరిపై ఉడికించాలి.
పులిహోర తయారీకి కావాల్సినవి:
అన్నం: మూడు కప్పులు
చింతపండు గుజ్జు: పావు కప్పు
బెల్లం తురుము: ఒక టీ స్పూన్( కావాలంటే)
మినప్పప్పు:ఒక టీస్పూన్
శెనగపప్పు : ఒక టీ స్పూన్
ఆవాలు : అరటీస్పూన్
జీలకర్ర: అర టీ స్పూన్
మెంతుల పొడి: అర టీ స్పూన్
పల్లీలు: ఒక టేబుల్ స్పూన్
ఇంగువ: చిటికెడు
పచ్చిమిర్చి: నాలుగు
ఎండుమిర్చి: నాలుగు
జీడిపప్పు పలుకులు: అర టేబుల్ స్పూన్ ( కావాలంటే)
పసుపు: అర టీ స్పూన్
కరివేపాకు : ఒక రెమ్మ
తయారీ విధానం: ఒక గిన్నెలో అన్నం వేసి చల్లార్చాలి. ముందుగా చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును కలపాలి. స్టవ్ పై పాన్ పెట్టి నూనె వేడి చేయాలి. ఇందులో ఆవాలు, జీలకర్ర మినప్పప్పు, శెనగపప్పు, కరివేపాకు, పసుపు, పల్లీలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీడిపప్పు, మెంతుల పొడి, ఇంగువ వేసి పోపు పెట్టాలి. ఆ పోవును అన్నంలో వేసి కలపాలి. ..
పాలతాలికలు తయారీకి కావలసినవి
బియ్యప్పిండి: అర కప్పు
బెల్లం: ముప్పావు కప్పు
నీళ్లు: ఒక కప్పు
నెయ్యి: టేబుల్ స్పూన్
పాలు: అర లీటర్
కొబ్బరి తురుము: పావు కప్పు
యాలకుల పొడి: టీ స్పూన్
జీడిపప్పు, బాదం పప్పు : కిస్ మిస్ ఒక్కోటి కొంచెం కొంచెం
తయారీవిధానం: ఒక గిన్నెలో టేబుల్ స్పూన్ బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోసి కరిగించాలి. బెల్లం కరిగిన తర్వాత బియ్యప్పిండిని దాంట్లో వేసి బాగా కలపాలి. ముద్దలా చేసుకుని ఐదు నిమిషాలు చల్లారబెట్టాలి. ఆ తర్వాత బియ్యప్పిండిని కొంచెం కొంచెం తీసుకుని పొడుగ్గా తాలికలు చేయాలి.. ఇంకో గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసి బెల్లం పాకం పట్టి చల్లారనివ్వాలి. ఇంకో గిన్నెలో అరలీటరు పాలు పోసి మరగించాలి. పాలు మరిగాక తాలికలు వేసి ఉడికించాలి. అదే పాలలో కొబ్బరి పొడి, యాలకుల పొడి వేసి విరగకుండా కలపాలి. పది నిమిషాలు ఉడికించి స్టవ్ ఆపేయాలి. చల్లారిన బెల్లం పాకాన్ని తాలికల్లో పోసి కలపాలి. ఆ తర్వాత నేతిలో వేగించిన జీడిపప్పు.. బాదం.. కిస్ మిస్ ను వేసి కలిపితే బొజ్జగణపయ్యకు ఇష్టమైన పాల తాళికలు రడీ. .