- తీసుకున్నవాటిని 30 ఏండ్లపాటు చెల్లిస్తం : ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్కుమార్
- కేసీఆర్ లేకుంటే కరెంట్ తీగల మీద బట్టలు ఆరేసుకునే పరిస్థితి వస్తుండే
- ఆయన దూరదృష్టిని చూసి మోడీకి అసూయ
- అప్పులను తిరిగి సక్రమంగా చెల్లిస్తున్న మొదటి రాష్ట్రం మనదే
- ఆరోపణలను బండి సంజయ్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్
- రాష్ట్రమే తెచ్చినోళ్లం.. అప్పులు తేలేమా : మంత్రి పువ్వాడ
- మిగతా రాష్ట్రాలు చీకట్లో ఉన్నయ్.. ఇక్కడ ఆ పరిస్థితి లేదని కామెంట్
హైదరాబాద్, వెలుగు: ప్రజలు, రైతుల కోసమే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తున్నదని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బి. వినోద్ కుమార్ అన్నారు. కేసీఆర్ దూరదృష్టిని చూసి మోడీ అసూయ పడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. చేసిన ప్రతి పైసా అప్పు ఇన్ఫ్రాస్ట్రక్చర్పైనే ఖర్చు చేశామని తెలిపారు. ఇంకా నిర్మించాల్సిన ప్రాజెక్టులు ఉన్నాయి కాబట్టే అప్పులు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. తాము ఐదారేండ్ల కింద అప్పులు చేశాం కాబట్టే కాళేశ్వరం నిర్మించగలిగామని, ఇప్పుడు అదే ప్రాజెక్టు నిర్మించాలంటే ఖర్చు భారీగా పెరిగిపోయేదని పేర్కొన్నారు. తీసుకున్న అప్పులను 30 ఏండ్ల పాటు చెల్లిస్తామన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో మంత్రి పువ్వాడ అజయ్తో కలిసి వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ‘‘తెలంగాణ ఫైనాన్షియల్ డిసిప్లేన్ ఉన్న రాష్ట్రమని నీతి ఆయోగ్ కితాబిచ్చింది. దేశంలో అన్ని రాష్ట్రాలు అప్పులు తీసుకుంటున్నాయి. వాటిని సక్రమంగా తిరిగి చెల్లిస్తున్న మొదటి రాష్ట్రం తెలంగాణ” అని ఆయన తెలిపారు. కేంద్రమే ఎఫ్ఆర్బీఎం నిబంధనలను అతిక్రమించి అప్పులు చేస్తున్నదని ఆరోపించారు. పరిమితికి మించి రాష్ట్రం అప్పులు తీసుకోలేదన్నారు. కార్పొరేషన్లు ప్రభుత్వ గ్యారంటీతో అప్పులు తీసుకునే వెసులుబాటు ఎఫ్ఆర్బీఎం చట్టంలోనే ఉందని పేర్కొన్నారు. తాము తీసుకుంటున్న అప్పులన్నీ ప్రజలు, రైతుల కోసమేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణ, జీతాలు, రైతుబంధు, బీమా, ఇతర స్కీములు అమలు చేసేందుకు అప్పులు చేయాల్సిన అవసరమే లేదని చెప్పారు. స్టేట్ ఓన్ రెవెన్యూతోనే అవన్నీ చేయగలుగుతామని, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఈ విషయం చెప్తున్నానని వినోద్కుమార్ అన్నారు. రాష్ట్రం అప్పులపై బండి సంజయ్ ప్రస్తావించిన ఇండియాబుల్స్ అనేది బ్రొకరేజీ సంస్థ మాత్రమేనని తెలిపారు. అది ఆర్బీఐ కాదు అనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. బాగా పని చేసే రాష్ట్రాన్ని ఇబ్బందుల పాలు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మించింది కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ బీహెచ్ఈఎల్ అనే విషయం బండి సంజయ్కు తెలుసా? సంజయ్ తనపై, తన కేంద్ర ప్రభుత్వంపైనే ఆరోపణలు చేసుకోవడం చూస్తే బాధనిపిస్తున్నది. బీహెచ్ఈఎల్ ఇచ్చిన సామగ్రి తుప్పుబట్టిందా? సంజయ్ ఆరోపణలు చూస్తుంటే కేసీఆర్ ప్రధాని మోడీకి కమీషన్ ఇచ్చినట్టుగా అనిపిస్తున్నది” అని వినోద్ కుమార్ అన్నారు. యూనిట్కు రూ.20 వరకు పెట్టి కొనుగోలు చేయాలని విద్యుత్ ఉత్పత్తి సంస్థలు ఒత్తిడి చేస్తున్నాయని తెలంగాణ నుంచి లేఖ రాస్తేనే కేంద్రం స్పందించి పీక్ అవర్స్లో యూనిట్కు రూ.12 వరకు చార్జ్ చేయాలని ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. ఎన్టీపీసీ నుంచి రాష్ట్రం యూనిట్కు రూ.7 పెట్టి కొనుగోలు చేస్తున్నదని, ఈ లెక్కన ఆ సంస్థ కేసీఆర్కు కమీషన్ ఇచ్చి కరెంట్ అమ్ముతున్నట్టా? అని ఆయన ప్రశ్నించారు. భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మిస్తామని అంబానీ, అదానీ వచ్చినా వారికి ఇవ్వకుండా సీఎం కేసీఆర్ బీహెచ్ఈఎల్కు నామినేషన్ పద్ధతిన అప్పగించారని
తెలిపారు.
కేంద్రం తేల్చకుంటే కోర్టులకెళ్తాం: పువ్వాడ
‘‘రాదనుకున్న తెలంగాణ రాష్ట్రమే తెచ్చినోళ్లం.. రాష్ట్రానికి అవసరమైన అప్పులు తేలేమా..’’ అని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. ప్రాజెక్టులు నిర్మించడానికే కొత్త అప్పులు తీసుకుంటున్నాం తప్ప అందులో ఒక్క పైసా వృథా చేయడం లేదని చెప్పారు. రాష్ట్రానికి ఉన్న ఆదాయాన్ని బట్టే అప్పులు వస్తాయన్నారు. అప్పుల్లో పైనుంచి ఐదో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్కు అప్పులు తీసుకునేందుకు అనుమతి ఇచ్చి, కింది నుంచి ఐదో స్థానంలో ఉన్న తెలంగాణకు కేంద్రం మోకాలడ్డుతోందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రాల అప్పులపై కేంద్రం పొలిటికల్ నిర్ణయాలు తీసుకోవడం ఏమిటన్నారు. ‘‘ఎఫ్ఆర్బీఎం పరిధిలో రాష్ట్రం అప్పులు తీసుకుంటే అడ్డుకుంటున్న కేంద్రం.. తాను మాత్రం ఎనిమిదేండ్లలో వంద లక్షల కోట్లు అప్పులు చేసింది. ఆ మొత్తాన్ని ఏం చేశారో చెప్తారా?’’ అని ప్రశ్నించారు. అప్పులపై కేంద్రం తేల్చకుంటే పైన న్యాయస్థానాలున్నాయని, అక్కడ తేల్చుకుంటామని పువ్వాడ పేర్కొన్నారు. కరెంట్ కొనుగోళ్లు, భద్రాద్రి పవర్ ప్లాంట్పై బండి సంజయ్ చేసిన ఆరోపణలు అవాస్తవమన్నారు. ‘‘బీహెచ్ఈఎల్ నుంచి సామగ్రి కొన్నాం కాబట్టే 25 వేల మంది ఆర్టిజన్లను రెగ్యులరైజ్ చేయగలిగాం. పవర్ ప్లాంట్లు ప్రైవేట్ వాళ్లకు ఇస్తే ఇది సాధ్యమయ్యేదా?” అని ప్రశ్నించారు. ‘‘దేశంలోని అన్ని రాష్ట్రాల్లో చీకటి ఉంటే ఒక్క తెలంగాణలోనే కరెంట్ ఎక్కువగా ఉంది. రోడ్డుపై వెళ్తే కనిపించకపోతే సంజయ్ విమానంలో రాత్రి పూట తిరిగితే ఏ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో తెలిసి వస్తుంది” అని ఆయన అన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను కేసీఆర్ కాపాడుతున్నారని, మూత పడేందుకు సిద్ధంగా ఉన్న ఆర్టీసీని రక్షించారని తెలిపారు.
బండి సంజయ్ ఆరోపణలు తుగ్లక్ కన్నా దారుణంగా ఉన్నయ్. కేసీఆర్ లేకుంటే కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినట్టు కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకునే పరిస్థితే వచ్చేది. రామగుండం ఎఫ్సీఐ నుంచి పొల్యూషన్ ఎక్కువగా వస్తుందని లోకల్ ఎమ్మెల్యే ఫిర్యాదు చేయడం తప్పా? సంజయ్ ఇప్పటికైనా తన ఆరోపణలు ఉపసంహరించుకోవాలి.
- బి. వినోద్ కుమార్, రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్
రాష్ట్రాల అప్పులపై కేంద్ర ప్రభుత్వం పొలిటికల్ నిర్ణయాలు తీసుకోవడం ఏమిటి? అప్పులపై కేంద్రం తేల్చకుంటే పైన న్యాయస్థానాలున్నయ్. అక్కడ తేల్చుకుంటాం. ప్రభుత్వరంగ సంస్థలను కేసీఆర్ కాపాడుతున్నరు. మూత పడేందుకు సిద్ధంగా ఉన్న
ఆర్టీసీని రక్షించారు.
- పువ్వాడ అజయ్ కుమార్, రవాణా శాఖ మంత్రి