IND vs SA: నాలుగు రోజుల్లో తొలి టెస్ట్.. స్వదేశానికి వచ్చేసిన విరాట్ కోహ్లీ

IND vs SA: నాలుగు రోజుల్లో తొలి టెస్ట్.. స్వదేశానికి వచ్చేసిన విరాట్ కోహ్లీ

దక్షిణాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా భారత క్రికెట్ జట్టుకు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. మొదట షమీ గాయం కారణంగా ఈ సిరీస్ మొత్తానికి దూరం కాగా.. వ్యక్తిగత కారణాల వలన ఇషాన్ కిషాన్ సఫారీ టూర్ నుండి వైదొలిగాడు. తాజాగా స్టార్ బ్యాటర్ విరాట్  కోహ్లీ స్వదేశానికి వచ్చేశాడు. నాలుగు రోజుల్లో సెంచూరియన్ వేదికగా తొలి టెస్టు జరగనుంది. ఈనేపధ్యంలో కోహ్లీ స్వదేశానికి రావడంతో అందరిలో కొత్త అనుమానాలు మొదలయ్యాయి. 

ఫ్యామిలీ అత్యవసర పరిస్థితుల కారణంగా కోహ్లీ భారత్ కు వచ్చినట్టు తెలుస్తుంది. అయితే కోహ్లీ స్వదేశానికి ఎందుకు వచ్చాడో స్పష్టంగా ఎవరికీ తెలియదు. విరాట్ ప్రస్తుతం ఇండియాలోనే ఉన్నా తొలి టెస్టు లో ఆడతాడా.. లేదా.. అనే విషయంలో కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదని బీసీసీఐ తెలియజేసింది.  డిసెంబర్ 26న సెంచూరియన్‌ వేదికగా జరిగే తొలి టెస్టు సమాయానికి  కోహ్లీ జట్టులో చేరతాడని బీసీసీఐ ధృవీకరించింది.

2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత కోహ్లీ ఇప్పటివరకు ఎలాంటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాతో 5 టీ20ల సిరీస్ కు, ఇటీవలే సౌతాఫ్రికాతో జరిగిన టీ20, వన్డే సిరీస్ కు దూరమయ్యాడు. ఇక ఈ టెస్టు సిరీస్ నుంచి యంగ్ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా దూరమయ్యాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో గైక్వాడ్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. 26 నుంచి సెంచూరియన్ లో మొదటి టెస్టు, జనవరి మూడు నుంచి కేప్ టౌన్ లో రెండో టెస్టు జరుగుతాయి. భారత టెస్ట్ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు.