న్యూఢిల్లీ: వొడాఫోన్ ఐడియా (వీఐ) బకాయిలు చెల్లించకపోవడంతో రూ.2,458 కోట్ల విలువైన ఈ కంపెనీ షేర్లను నోకియా, ఎరిక్సన్ దక్కించుకోనున్నాయి. ఫాలో ఆన్ ఆఫర్లోని ధరతో పోలిస్తే 35 శాతం ఎక్కువకు ప్రిఫరెన్షియల్ షేర్లను ఇష్యూ చేయడానికి ఈ టెలికం కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. లాకిన్ పీరియడ్ 6 నెలలు. అంటే నోకియా, ఎరిక్సన్ తమ వొడాఫోన్ ఐడియా షేర్లను లాకిన్ పీరియడ్లో అమ్మకూడదు.
ఫేస్ వాల్యూ 10 ఉన్న 166 కోట్ల షేర్లను ఒక్కో షేరు ధర రూ.14.80 దగ్గర నోకియా సొల్యూషన్స్ అండ్ నెట్వర్క్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు, ఎరిక్సన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కు ఇష్యూ చేయడానికి కంపెనీ బోర్డు ఆమోదం తెలిపిందని వొడాఫోన్ ఐడియా ప్రకటించింది. ఈ షేర్ల విలువ రూ.2,458 కోట్లని పేర్కొంది. నోకియాకు రూ.1,520 కోట్ల విలువైన షేర్లు , ఎరిక్సన్కు రూ.938 కోట్ల విలువైన షేర్లు దక్కుతాయి. వొడాఫోన్ ఐడియాలో నోకియా వాటా 1.5 శాతానికి, ఎరిక్సన్ వాటా 0.9 శాతానికి పెరుగుతుంది.