
వనపర్తి, వెలుగు: జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్ మండలంగా తీసుకున్న గోపాల్పేట మండలంలోని భూ భారతి దరఖాస్తులను జూన్ 2 లోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం తన ఛాంబర్ లో భూ భారతిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారం పై సమీక్ష నిర్వహించారు. వనపర్తి జిల్లాలో భూ భారతి చట్టం అమలును గోపాల్ పేట మండలాన్ని పైలట్ ప్రాజెక్టు గా తీసుకొని మే 5 నుంచి 13 వరకు ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకోగా మొత్తం 573 అప్లికేషన్లు వచ్చాయని, అందులో 155 సక్సేషన్, 131 సాదా బైనామా, పెండింగ్ మ్యుటేషన్, అసైన్మెంట్ మొదలగు దరఖాస్తులు వచ్చాయన్నారు. వీటన్నింటినీ జూన్ 2 లోగా పరిష్కరించాల్సి ఉందన్నారు.
తహసీల్దార్ లాగిన్ లో పరిష్కారం అయ్యే వాటిని త్వరగా పరిష్కరించి ఆర్డీఓ లాగిన్ కు పంపాలని, కలెక్టర్ ద్వారా పరిష్కరించాల్సినవి కలెక్టర్ లాగిన్ కు పంపించాలని తహసీల్దార్లను ఆదేశించారు. జూన్ 2 నుంచి జిల్లాలోని అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో భూ భారతి చట్టం అమలు చేసేందుకు రెవెన్యూ సదస్సులు నిర్వహించాల్సి ఉంటుందని అందుకు తగిన ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ వేంకటేశ్వర్లు, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, గోపాల్పేట తహసీల్దార్ పాండు నాయక్, రాజు సెక్షన్ సూపరింటెండెంట్ మదన్ మోహన్, తదితరులు పాల్గొన్నారు.