వనపర్తి జిల్లాలో  సీజనల్​ వ్యాధులు ప్రబలకుండా చూడాలి : కలెక్టర్​ఆదర్శ్ సురభి 

వనపర్తి జిల్లాలో  సీజనల్​ వ్యాధులు ప్రబలకుండా చూడాలి : కలెక్టర్​ఆదర్శ్ సురభి 

వనపర్తి, వెలుగు : జిల్లాలో డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, డయేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా  ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్​ ఆదర్శ్​ సురభి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లో వైద్యాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధుమేహం, క్షయ వ్యాధిగ్రస్తులకు అందించే వైద్య చికిత్సలను అప్​డేట్ చేసుకునేలా ప్రత్యేక యాప్ జూన్ 20 వరకు అందుబాటులోకి తెస్తామన్నారు. అందుకు అవసరమైన వివరాలు ఇవ్వాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని సూచించారు.   

స్కూళ్లలో స్టూడెంట్ల నమోదు పెంచాలి..

జిల్లాలోని గవర్నమెంట్ స్కూళ్లలో స్టూడెంట్ల నమోదు శాతం పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. విద్య, వైద్యం, సంక్షేమం, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో బడి బాట కార్యక్రమంపై సమన్వయ సమావేశం నిర్వహించారు.  జూన్ 6 నుంచి 19 వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శి, ఆశా వర్కర్లు, అంగన్ వాడీ కార్యకర్తలు, మహిళా సంఘాల సభ్యులు సమన్వయంతో పనిచేయాలన్నారు.

ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు గణనీయంగా పెంచాలని ఆదేశించారు. జూన్ 10 లోపు అన్ని పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫామ్స్​ చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు.  సమావేశంలో ఏడీసీ యాదయ్య, డీఈవో  అబ్దుల్ ఘనీ, డీఎంహెచ్​వో  శ్రీనివాసులు, జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ సుధారాణి, పీడీడీఆర్ డీఏ ఉమాదేవి, ఎంఈవోలు, క్లస్టర్ హెడ్మాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.