
వనపర్తి , వెలుగు : రూ.1500 చోరీ చేసిన ఓ వ్యక్తికి మూడేండ్ల జైలు, రూ.200 ఫైన్ విధిస్తూ వనపర్తి జిల్లా ఆత్మకూరు మొదటి అదనపు న్యాయమూర్తి బి.శ్రీలత తీర్పు చెప్పారు. వివరాల్లోకి వెళ్తే... ఈ ఏడాది ఫిబ్రవరి 23న ఆత్మకూరు పట్టణానికి చెందిన పరమాల మణివర్ధన్రెడ్డి వ్యక్తిగత పని మీద బయటకు వెళ్లగా, ఇంట్లో ఉన్న అతడి అత్త పక్కింటికి వెళ్లింది. ఈ టైంలో గ్రామానికి చెందిన బొల్లి కురుమూర్తి మణివర్ధన్రెడ్డి ఇంటికి వచ్చి తాళం పగులగొట్టి పూజ గదిలోని హుండీలో ఉన్న రూ.1500 దొంగిలించాడు.
చోరీ విషయం తెలుసుకున్న మణివర్ధన్రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై నరేందర్ కేసు నమోదు చేశారు. నిందితుడు బొల్లి కురుమూర్తిని అరెస్ట్చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం నేరం నిరూపణ కావడంతో కురుమూర్తికి మూడేండ్ల జైలు విధిస్తూ న్యాయమూర్తి శ్రీలత తీర్పు చెప్పారని వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు.