
ఖిల్లాగణపురం, వెలుగు: గణప సముద్రం రిజర్వాయర్ నిర్మాణానికి సహకరించాలని వనపర్తి ఆర్డీవో సుబ్రహ్మణ్యం రైతులను కోరారు. శుక్రవారం రైతు వేదికలో ఇరిగేషన్ ఆఫీసర్లు, సర్వేయర్ తో కలిసి గణప సముద్రం రిజర్వాయర్ లో భూములు కోల్పోతున్న రైతులతో సమావేశం నిర్వహించారు. ముంపు రైతుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గణప సముద్రం రిజర్వాయర్ నిర్మాణానికి 603.46 ఎకరాలు అవసరం ఉందని, ఇందులో 388 ఎకరాలు గణప సముద్రం చెరువులో శిఖం పట్టాలు ఉన్నాయని తెలిపారు.
603.46 ఎకరాల్లో 991 మంది రైతులు ఉండగా, 251 మంది రైతులు భూమి ఇచ్చేందుకు అంగీకరించి అవార్డు తీసుకున్నారని, మిగిలిన 740 మంది రైతులు అంగీకరిస్తే రిజర్వాయర్ పూర్తవుతుందని తెలిపారు. దీంతో 5,200 ఎకరాలకు సాగునీరు అందించవచ్చని చెప్పారు. ఖిల్లాగణపురం మండలంతో పాటు నిజాలపూర్, ముసాపేట, ముహమ్మద్ హుస్సేన్ పల్లి గ్రామాల రైతులకు సాగునీరు అందుతుందని తెలిపారు.
భూమి కోల్పోతున్న రైతులకు మార్కెట్ రేట్, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎకరాకు రూ.11 నుంచి 12 లక్షలు పరిహారం అందుతుందని చెప్పారు. ప్రస్తుతం మార్కెట్ రేట్లు పెరిగాయని, అందుకు అనుగుణంగా పరిహారం ఇవ్వాలని రైతులు కోరారు. ఇరిగేషన్ డీఈ నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం మండలంలోని అప్పారెడ్డిపల్లిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సును సందర్శించారు.