- ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్కు మాస్టర్ ప్లాన్
- విమానాశ్రయ అధికారులతో మంత్రి పొంగులేటి సమీక్ష
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్లేందుకు వరంగల్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేసిందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టులను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు అవసరమైన భూసేకరణ, సాంకేతిక అనుమతులు, మౌలిక వసతుల ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
శనివారం సెక్రటేరియెట్ లోని తన కార్యాలయంలో ఎయిర్పోర్ట్ అథారిటీ సదరన్ రీజియన్ ఎ గ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజ్ కిశోర్, ఏవియేషన్ డైరెక్టర్ భరత్రెడ్డి తదితరులతో కలిసి వరంగల్, ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించతలపెట్టిన ఎయిర్ పోర్ట్లపై మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ పనులను త్వరితగతిన ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. వరంగల్ ఎయిర్ పోర్ట్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సుమారు 953 ఎకరాల భూమిని సేకరించి కేంద్రానికి అప్పగించిందని, వీలైనంత త్వరగా శంకుస్థాపన చేస్తామన్నారు.
అలాగే, ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని డిఫెన్స్ (రక్షణ శాఖ) సివిల్ ఏవియేషన్, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించాయని, ఇందుకు సంబంధించి మాస్టర్ ప్లాన్ తక్షణమే సిద్ధం చేయాలని సూచించారు. ఈ ఎయిర్ పోర్ట్కు అవసరమైన భూ సేకరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గతంలో ప్రతిపాదించిన స్థలం విమానాశ్రయ నిర్మాణానికి అనుకూలంగా లేదని కేంద్ర పౌర విమానయాన శాఖ తెలిపిన నేపథ్యంలో దీనిపై మరింత అధ్యయనం చేసి సాధ్యాసాధ్యాలపై నివేదిక రూపొందించాలని ఆదేశించారు.

