గుండెపోటుతో వార్డు ఆఫీసర్ మృతి

గుండెపోటుతో వార్డు ఆఫీసర్ మృతి

మెట్ పల్లి, వెలుగు: జగిత్యాల జిల్లాలో వార్డు ఆఫీసర్ గుండెపోటుతో చనిపోయాడు. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. మెట్ పల్లి మున్సిపాలిటీకి చెందిన కట్ట సత్యనారాయణ, భాగ్యలక్ష్మి దంపతులకు నలుగురు కొడుకులు. కాగా.. చిన్న కొడుకు హరీశ్(24) బీటెక్ పూర్తి చేశాడు. ఇటీవల  గ్రూప్స్ – 4 పరీక్షలో ఎంపికై మెట్ పల్లి మున్సిపల్ మూడో వార్డు ఆఫీసర్ గా డిసెంబర్ లో జాయిన్ అయ్యాడు. సోమవారం రాత్రి కుటుంబ సభ్యులతో భోజనం చేసి తన రూమ్ లో పడుకున్నాడు.  

మంగళవారం ఉదయం బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా బెడ్ పై విగతజీవిగా పడి ఉన్నాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన డాక్టర్లు అప్పటికే గుండెపోటుతో చనిపోయినట్లు చెప్పారు.  కొడుకు మృతితో తల్లిదండ్రులు బోరున విలపించారు. వార్డ్ ఆఫీసర్ మృతికి కమిషనర్ మోహన్, మున్సిపల్ ఉద్యోగులు సంతాపం తెలిపారు.