
- రెండు, మూడు సార్లు చేస్తే కనెక్షన్ కట్
అసలే ఎండా కాలం. నీళ్లు దొరకడం గగనమైపోయింది. భూమిలో నీళ్లన్నీ ఎక్కడో లోపలికి వెళ్లిపోయాయి. నదులు, చెరువుల్లో నీళ్లు ఆరిపోతున్నాయి. తాగడానికీ నీళ్లు రావాలంటే ఓ రెండు రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి. అలాంటి నీళ్లను ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి.
ఒక్క బకెట్ వేస్ట్ చేసినా దాని ప్రభావం పెద్దగానే ఉంటుంది. అందుకే, నీటిని జాగ్రత్తగా వాడుకునేలా, ఎవరూ వేస్ట్ చేయకుండా గుజరాత్లోని దాహోద్ నగరం ఓ మంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది. ఏంటంటారా.. అది ‘ఫైన్’! అవును, నీళ్లను వృథాగా పారబోసే జనానికి జరిమానాలు వేస్తోంది. అన్ని చెరువులు, నదుల్లాగానే ఆ నగరానికి నీళ్లు అందించే ప్రధాన వనరులైన కదన డ్యాం, పాటా దుంగరి చెరువుల్లో నీటిమట్టాలు దారుణంగా పడిపోయాయి.
నీటి కొరత ఎక్కువైంది. రోజుతప్పించి రోజు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఈ కొరతను దృష్టిలో పెట్టుకునే ఈ ఫైన్ను తీసుకొచ్చినట్టు నీటి సరఫరా కమిటీ హెడ్ లఖాన్ రాజ్గోర్ చెప్పారు. నీటిని వేస్ట్ చేస్తున్నట్టు తెలిస్తే ₹250 నుంచి ₹500 వరకు జరిమానా విధిస్తున్నామన్నారు. అందుకోసం 9 వార్డు కమిటీలను ఏర్పాటు చేశామన్నారు.
అన్ని ప్రాంతాల్లోనూ డ్రైవ్స్ నిర్వహించాల్సిందిగా అధికారులను ఆదేశించామన్నారు. ఫైన్ వేసినా రెండోసారి, మూడోసారి వేస్ట్ చేస్తున్నట్టు తేలితే ఆ ఇంటికి నీటి కనెక్షన్ను తొలగిస్తామని హెచ్చరించారు. దాహోద్కు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన రైతులు కొందరు నీటి సరఫరా పైపుల నుంచి నీటిని చోరీ చేస్తున్నట్టు వడోదర జిల్లా కలెక్టర్ చెప్పారన్నారు.