కాళేశ్వరం... తెలంగాణ శనేశ్వరం.. అనాలోచిత ప్లాన్​తో ప్రాజెక్ట్ కట్టారు

కాళేశ్వరం... తెలంగాణ శనేశ్వరం..  అనాలోచిత ప్లాన్​తో ప్రాజెక్ట్ కట్టారు

బషీర్ బాగ్, వెలుగు: రాష్ట్రానికి కాళేశ్వరం ప్రాజెక్టు శనేశ్వరంలా తయారైందని జలవనరుల నిపుణులు, మేధావులు విమర్శించారు. అనాలోచిత ప్లాన్​తో ఆగమేఘాలపై ప్రాజెక్టు కట్టి వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు నిర్మించి సీఎం కేసీఆర్ పెద్ద తప్పు చేశారని, ఇది రాష్ట్ర ఖజానాకు గుదిబండగా మారిందని ఫైర్ అయ్యారు. హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో  ‘కుంగిన మేడిగడ్డ బ్యారేజ్’ అంశంపై తెలంగాణ సమాఖ్య, ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. 

జలవనరుల నిపుణులు దొంతుల లక్ష్మీనారాయణ, బీవీ సుబ్బారావు, సుప్రీంకోర్టు సీనియర్ లాయర్​ నిరూప్ రెడ్డి, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, జర్నలిస్టు సంఘాల నాయకులు మామిడి సోమయ్య, కె.కోటేశ్వరరావు, అనంచిన్ని వెంకటేశ్వరరావు, కరుణాకర్ దేశాయ్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. కేసీఆర్ చీఫ్ ఇంజినీర్ గా అవతారమెత్తి తుమ్మిడి హట్టి నుంచి మేడిగడ్డకు సైట్ మార్చి మొదటి తప్పు చేశారని అన్నారు. ప్రాణహిత- చేవెళ్ల పేరుతో ఉన్న ప్రాజెక్టు పేరు మార్చి, కేవలం 30 వేల కోట్లతో పూర్తి కావలసిన ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రీడిజైన్ పేరుతో లక్షా 30 వేల కోట్లకు పెంచారని తెలిపారు. 

రాష్ట్ర వార్షిక బడ్జెట్ లో దాదాపు మూడో వంతు ఖర్చు పెట్టారని, అయినా రాష్ట్ర ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడకపోగా  ఏటా వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృథా చేశారని మండిపడ్డారు. నాలుగేండ్లకే పిల్లర్లు కుంగిపోయాయంటే ఈ  బ్యారేజ్ ఎక్కువ కాలం నిలవదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల తాము మేడిగడ్డ బ్యారేజ్​ను సందర్శించినప్పుడు నాణ్యతా లోపం కనిపించిందని తెలిపారు. మేడిగడ్డలాగా అన్నారం బ్యారేజ్ కూడా ఏదో ఒకరోజు కుంగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 

తప్పుడు విధానాలతో పాలకులు లక్షల కోట్ల ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని, ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నిస్తే సహించలేకపోతున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ తప్పులపై ప్రజల్లో ప్రశ్నించే తత్వం పెరగాలని, పాలకుల నుంచి జవాబు రాబట్టే శక్తి మళ్లీ రావాలని వారు ఆకాంక్షించారు.