- నాచారం గుట్ట హల్దీ వాగులో స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు..
- మెదక్ పట్టణ పరిధి పిల్లికోటాలలో బాలుడితో పాటు, మరో వ్యక్తి మృతి
గజ్వేల్/వర్గల్, వెలుగు : దైవదర్శనానికి ముందు స్నానం చేసేందుకు వాగులో దిగిన ముగ్గురు యువకులు ప్రమాదవశాత్తు నీట మునిగి చనిపోయారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారంగుట్ట వద్ద గురువారం జరిగింది.
గౌరారం ఎస్సై ఆరోగ్యం, మృతుల ఫ్రెండ్స్ తెలిపిన వివరాల ప్రకారం... మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణానికి చెందిన ఎర్రగొళ్ల ప్రశాంత్ (27), కిచ్చేర్ వికాస్, కొంతమి ఆనంద్రెడ్డి (27) స్నేహితులు. ఈ ముగ్గురు బుధవారం తూప్రాన్లో జరిగిన ఒక పెండ్లికి హాజరయ్యారు. అనంతరం దైవ దర్శనం చేసుకునేందుకు నాచారంగుట్టకు వచ్చారు. ఈ క్రమంలో స్నానం చేసేందుకు గోశాల సమీపంలో ఉన్న హల్దీ వాగు వద్దకు వెళ్లారు.
మొదట ఆనంద్రెడ్డి, వికాస్ ఇద్దరు నీటిలోకి దిగగా లోతు ఎక్కువగా ఉండడంతో మునిగిపోసాగారు. గమనించిన ప్రశాంత్ వారిని కాపాడేందుకు నీటిలోకి దిగగా.. అతడు కూడా మునిగిపోయాడు. ఆ ప్రాంతంలో జనసంచారం లేకపోవడంతో ఎవరూ గమనించలేదు. రాత్రి అయినా ప్రశాంత్ ఇంటికి రాకపోవడంతో అతడి తండ్రి రాజు ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఎవరూ లిఫ్ట్ చేయలేదు. రాత్రి 11 గంటల సమయంలో వాగు వైపు వచ్చిన ఓ వ్యక్తి ఫోన్ రింగ్ సౌండ్ను విని లిఫ్ట్ చేసి.. వాగు ఒడ్డున దుస్తులు, ఫోన్లు మాత్రమే ఉన్నాయని మనుషులు ఎవ్వరూ లేరని చెప్పాడు.
దీంతో రాజు నాచారంగుట్ట వద్దకు చేరుకుని.. గౌరారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు మొదలుపెట్టారు. గురువారం ఉదయం ముగ్గురి డెడ్బాడీలు బయటకు తేలడంతో బయటకు తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
బాలుడిని కాపాడబోయి...
మెదక్, వెలుగు : నీటి కుంటలో పడి మునిగిపోతున్న బాలుడిని కాపాడబోయి అతడితో పాటు మరో వ్యక్తి చనిపోయాడు. ఈ ఘటన మెదక్ పట్టణ పరిధిలో గురువారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... చేగుంట మండలం వడ్యారం గ్రామానికి చెందిన నవీదీప్ (13) ఇటీవల ఏడో తరగతి పూర్తి చేశాడు.
వేసవి సెలవులు కావడంతో మెదక్ పట్టణ పరిధిలోని పిల్లికోటాలలో అమ్మమ్మ ఇంటికి వచ్చాడు. గురువారం నవదీప్, ప్రణయ్, మరో ఇద్దరు కలిసి సమీపంలోని కుమ్మరి కుంటలో చేపలు పట్టేందుకు వెళ్లారు. ఈ క్రమంలో నవదీప్ నీటిలో పడి మునిగిపోయాడు. ఇదే సమయంలో అటు వైపు వెళ్తున్న యాదగిరి (40) అనే వ్యక్తి బాలుడిని గమనించి కాపాడేందుకు ప్రయత్నించగా.. అతడు సైతం నీటిలో మునిగిపోయాడు.
ఈ విషయాన్ని మిగతా పిల్లలు గ్రామస్తులకు చెప్పడంతో సమాచారం అందుకున్న పోలీసులు.. అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లను రప్పించి నీటి కుంటలో గాలించగా.. యాదగిరి, నవదీప్ డెడ్బాడీలు దొరికాయి. మెదక్ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
