సింగరేణికి నష్టం రానివ్వం : కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి

సింగరేణికి నష్టం రానివ్వం : కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి
  •  తెలంగాణ బిడ్డగా అది నా బాధ్యత 
  • సుప్రీంకోర్టు గైడ్ లైన్స్​ మేరకే బొగ్గు గనుల వేలం
  • రాష్ట్ర ప్రభుత్వాలకూ లబ్ధి.. దీనిని రాజకీయం చేయొద్దు
  • నైనీబ్లాక్​తో లాభాలు వచ్చేలా ఒడిశా, తెలంగాణతో చర్చిస్తం
  • గత సర్కారు విధానాలతోనే సింగరేణి నష్టాల్లోకి వెళ్లిందని కామెంట్​
  • పదో రౌండ్ కమర్షియల్ బొగ్గు గనుల వేలం ప్రారంభం
  • సింగరేణికి కొత్త గనులను కేటాయించాలి: డిప్యూటీ సీఎం  భట్టి
  • ప్రధానితో మాట్లాడి, ఒప్పించాలని కేంద్ర మంత్రికి విజ్ఞప్తి

హైదరాబాద్​, వెలుగు: బొగ్గు గనుల వేలంతో సింగరేణికి గానీ, అందులో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు గానీ ఎలాంటి నష్టం రానివ్వబోమని,  తెలంగాణ బిడ్డగా అది తన బాధ్యత అని  కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్​రెడ్డి స్పష్టం చేశారు.  సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగానే వేలం నిర్వహిస్తున్నాం తప్ప.. ఆదాయం కోసం కాదని పేర్కొన్నారు. 

గత బీఆర్ఎస్​ప్రభుత్వ విధానాలతోనే సింగరేణి నష్టాల్లోకి వెళ్లిందని,  సంస్థను ఆదుకునేందుకు తాము అన్ని రకాలుగా సహకరిస్తామని చెప్పారు. శుక్రవారం హైదరాబాద్​లోని ఓ హోటల్​లో 10వ రౌండ్ కమర్షియల్ బొగ్గు గనుల వేలాన్ని ఆ శాఖ సహాయ మంత్రి సతీశ్​ చంద్ర దూబే, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి కిషన్​రెడ్డి  ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్​రెడ్డి మాట్లాడుతూ..

 ‘సింగరేణి విషయంలో బొగ్గు గనుల శాఖ అధికారులకు పూర్తి అవగాహన ఉంది. ఈ విషయాన్ని ఎవరూ రాజకీయం చేయకూడదని కోరుతున్నా. కాంగ్రెస్, బీజేపీ ఒకటేనని బీఆర్ఎస్.. బీజేపీ, బీఆర్ఎస్​ ఒకటేనని కాంగ్రెస్ నేతలు విమర్శలు చేయడం సరికాదు. సింగరేణి కార్మికులు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేస్తున్నా. సింగరేణి కాలరీస్​లో కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉంది.  సింగరేణిని కాపాడే బాధ్యత మాపై కూడా ఉంది.

 కమర్షియల్​ మైన్​ వేలం పారదర్శకంగా జరుగుతోంది. బిడ్డర్లకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుంది. వేలం పాటతో రాష్ట్రాలకే ఆదాయం వస్తుంది తప్ప కేంద్రానికి కాదు’’ అని వివరించారు.  ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్​ లో సింగరేణి లాభం పొందేలా ఉత్పత్తిని ప్రారంభిస్తామని, ఈ విషయమై త్వరలో ఒడిశా, తెలంగాణ ప్రభుత్వాలతో మాట్లాడుతామని చెప్పారు. పదేండ్ల క్రితం రాష్ట్రంలో పరిశ్రమలకు పవర్​ హాలీడే ఇవ్వాల్సిన దుస్థితి ఉండేదని, కొత్త పాలసీతో నిరంతర విద్యుత్​ సరఫరా జరుగుతోందని కిషన్​రెడ్డి వివరించారు.  

దేశం 5  ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందడంలోనూ బొగ్గు కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు. బొగ్గు పారిశ్రామికవేత్తలంతా సమిష్టి కృషితో దేశ ప్రగతికి సహకరించాలని కోరారు.  కోల్​ రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధించాలన్న ప్రధాని మోదీ దార్శనికతకు అనుగుణంగా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం అవసరమని స్పష్టం చేశారు.

 దేశ ఆర్థిక వృద్ధి దిశగా దేశీయ బొగ్గు ఉత్పాదకతను పెంచుకోవాల్సి ఉన్నదని చెప్పారు. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క తమ దృష్టికి తెచ్చిన అంశాలపై చర్చించి, నిర్ణయం తీసుకుంటామని కిషన్​ రెడ్డి స్పష్టం చేశారు. వేలంలో బొగ్గు గనులు దక్కించుకున్న సంస్థలకు వాణిజ్య సౌలభ్యం కోసం ప్రభుత్వం అవసరమైన మద్దతునిస్తుందని కేంద్ర బొగ్గు శాఖ సహాయ మంత్రి  సతీశ్​ చంద్ర దూబే పేర్కొన్నారు.

టెండర్​పత్రాల విక్రయాలు షురూ..

కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ శుక్రవారం వాణిజ్య బొగ్గు గనుల 10వ విడత వేలం ప్రారంభించింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా తెలంగాణ తోపాటు బిహార్, చత్తీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పశ్చిమ బెంగాల్ తదితర 8 రాష్ట్రాల పరిధిలోని మొత్తం 67 బొగ్గు గనులను వేలంలో పెట్టింది. టెండర్ పత్రాల విక్రయం శుక్రవారం( 2024 జూన్ 21) నుంచే ప్రారంభమైంది. గనుల వివరాలు, వేలం నిబంధనలు, కాల వ్యవధి తదితర వివరాల కోసం ‘ఎంఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీసీ’ వేలం వేదికతోపాటు బొగ్గు మంత్రిత్వ శాఖ వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చూడవచ్చని అధికారులు తెలిపారు. రాబడిలో ఆదాయ వాటా శాతం ప్రాతిపదికగా ఈ వేలం రెండు దశల్లో పారదర్శకంగా ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహిస్తామని వెల్లడించారు.

న్యాయం చేయాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

సింగరేణికి కొత్త గనులను కేటాయించాలని డిప్యూటీ సీఎం  భట్టివిక్రమార్క డిమాండ్​ చేశారు. తెలంగాణ బొగ్గు బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ప్రైవేట్ సంస్థలకు కేటాయించడం బాధాకరమని పేర్కొన్నారు. సింగరేణి మనుగడ సాగించాలంటే సంస్థకు మరిన్ని గనులు కేటాయించాల్సిన అవసరం ఉందని చెప్పారు.  సింగరేణి బొగ్గుతోనే ఇక్కడ విద్యుదుత్పత్తి సంస్థలు నడుస్తున్నాయని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పు వల్ల సింగరేణి నష్టపోయిందని తెలిపారు.

 రిజర్వేషన్ ప్రక్రియ ద్వారా సింగరేణికి తెలంగాణ గనులను  కేటాయించవచ్చని చెప్పారు.  ఎన్ఎండీఆర్ యాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ముందు బొగ్గు గనులపై సింగరేణికి పూర్తి అధికారం ఉండేదని చెప్పారు. ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక ఎన్ఎండీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొత్త సవరణను తెచ్చిందని, దీని ప్రకారం సింగరేణి తన హక్కులను కోల్పోయిందన్నారు. బొగ్గు గనుల వేలాన్ని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో ఇందులో పాల్గొన్నట్టు చెప్పారు. 

సింగరేణికి న్యాయం చేసేలా ప్రధాని మోదీతో మాట్లాడాలని కిషన్​రెడ్డిని కోరారు. రాజకీయ ప్రయోజనాలను పక్కనబెట్టి సింగరేణిని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. తెలంగాణ బిడ్డగా రాష్ట్రానికి న్యాయం చేయాల్సిన బాధ్యత కిషన్ రెడ్డిపై ఉందన్నారు. తెలంగాణలో విద్యుత్ వినియోగం పెరిగిందని, బొగ్గు ఉంటేనే భవిష్యత్తులో విద్యుత్ అవసరాలు తీరుతాయని భట్టి చెప్పారు.

 ప్రైవేట్ సంస్థలకు కేటాయించిన సత్తుపల్లి, కొయ్యగూడెం బ్లాక్ లను రద్దుచేసి సింగరేణికి అప్పగించాలని, ఇందుకు కిషన్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. గోదావరి పరివాహక ప్రాంత బొగ్గు బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లన్నింటినీ సింగరేణికే కేటాయించాలని కోరారు. తెలంగాణలోని శ్రావణ పల్లి బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సింగరేణికి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో   కేంద్ర బొగ్గు శాఖ కార్యదర్శి అమృత్ లాల్ మీనా, అదనపు కార్యదర్శి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.