
- సంకుచిత మనస్తత్వం ఉన్న వ్యక్తి మోడీ
- రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ బీ వినోద్ కుమార్
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శనివా రం (ఏప్రిల్ 8) పరేడ్ మైదానంలో నిర్వహించే సభకు సీఎం కేసీఆర్ వెళ్లడం లేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ చెప్పారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. తాము మోడీ చూపిన బాటలోనే ముందుకు వెళ్తున్నట్టు క్లారిటీ ఇచ్చారు. ప్రధాని గతంలో రాష్ట్రానికి వచ్చిన సమయంలో కేసీఆర్ ను స్వాగతం పలికేందుకు రావద్దని చెప్పారని ఆయన గుర్తు చేశారు.
కొవిడ్ సమయంలో ప్రధాని ప్రొటోకాల్ ను పట్టించుకోకుండా కేసీఆర్ ను అవమాన పర్చారని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ సంకుచిత మనస్తత్వం ఉన్న వ్యక్తి అని పేర్కొన్నారు. రాజ్యాంగ బద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రినే అవమానించారని అన్నారు.
మారని తీరు
14 నెలల వ్యవధిలో ప్రధాని నరేంద్ర మోడీ నాలుగు సార్లు రాష్ట్రానికి వచ్చారు. ఈ నాలుగు సార్లు సీఎం కేసీఆర్ ప్రధానికి స్వాగతం పలికేందుకు వెళ్లలేదు. రేపు కూడా మోడీకి స్వాగతం చెప్పేందుకు సీఎం వెళ్లబోరని బీఆర్ఎస్ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా తెలంగాణలో రూ. 11, 300 కోట్ల విలువైన ప్రాజెక్టులను మోడీ శంకుస్థాపన చేయనున్నారు. వందేభారత్ రైలును కూడా మోడీ ప్రారంభిస్తారు.