89% రైల్వేస్టేషన్లలో కనీస అవసరాలు లేవు.. హైదరాబాద్ స్టేషన్ నీళ్లలో ఈకోలీ బ్యాక్టీరియా: కాగ్ రిపోర్ట్

89% రైల్వేస్టేషన్లలో కనీస అవసరాలు లేవు.. హైదరాబాద్ స్టేషన్ నీళ్లలో ఈకోలీ బ్యాక్టీరియా: కాగ్ రిపోర్ట్

దేశంలోని రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు అందుతున్న సేవలపై కేంద్ర ప్రభుత్వ సంస్థ కాగ్ విడుదల చేసిన రిపోర్ట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. రైల్వే మంత్రిత్వ శాఖ పలు నిబంధనలు రూపొందించినప్పటికీ.. క్షేత్రస్థాయిలో జోన్‌లు వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయని కాగ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రైళ్ల రాకపోకలు పెరుగుతున్న తరుణంలో.. ప్రయాణికుల ఆరోగ్యం, సేఫ్టీకి అత్యంత కీలకమైన తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ వైఫల్యాలను ఎదుర్కొంటున్నట్లు ఈ ఆడిట్ రిపోర్ట్ బయటపెట్టింది.

తాగునీటిలో ప్రమాదకర ఈకోలీ బ్యాక్టీరియా:
రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు సేవిస్తున్న తాగునీరు ఎంత ప్రమాదకరంగా మారిందో కాగ్ రిపోర్ట్ స్పష్టం చేసింది. వాటర్ కూలర్లు, ప్లాట్‌ఫార్మ్‌లపై ఉన్న కుళాయిల నుంచి సేకరించిన వాటర్ శాంపిల్స్ పరీక్షించగా.. అందులో ప్రాణాంతకమైన ఈకోలీ బ్యాక్టీరియా, టోటల్ కోలిఫార్మ్స్ బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది. దేశవ్యాప్తంగా పలు కీలక స్టేషన్లలో ఈ కాలుష్యం బయటపడటం ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వైనాన్ని కళ్లకు కడుతోంది. కోయంబత్తూరు, పాల్‌ఘాట్, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, భివండి రోడ్, కల్యాణ్, లోనావాలా, మధుపూర్ స్టేషన్లతో పాటు.. తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన కేంద్రమైన హైదరాబాద్ స్టేషన్‌లోనూ వాటర్ కూలర్ల నీటిలో ఈకోలి బ్యాక్టీరియా ఉన్నట్లు తేలటం తీవ్ర కలకరం రేపుతోంది.

హైదరాబాద్ స్టేషన్‌లోనూ తాగునీటి కాలుష్యం:

సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోని సికింద్రాబాద్, విజయవాడ వంటి స్టేషన్లతో పాటు ముఖ్యమైన హైదరాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఈ తాగునీటి నాణ్యతా లోపాల బారిన పడటం గమనార్హం. ప్రయాణికులు అమాయకంగా తాగేస్తున్న తాగునీటి కూలర్లలో ఈకోలి బ్యాక్టీరియా ఉండటం ఇక్కడి పారిశుద్ధ్య లోపాలను, పర్యవేక్షణ రాహిత్యాన్ని ఎత్తిచూపుతోంది. లక్షలాది మంది రాకపోకలు సాగించే ఈ స్టేషన్‌లో నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పరీక్షించాల్సిన అధికార యంత్రాంగం విఫలమవడం ప్రయాణికుల ఆరోగ్యానికి సవాలుగా మారుతోంది. 6 జోన్ల పరిధిలోని 59 స్టేషన్లలో అసలు బాక్టీరియాలాజికల్ పరీక్షలే నిర్వహించలేదని కాగ్ రిపోర్ట్ బయటపెట్టడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.

దయనీయ స్థితిలో స్టేషన్లు:
కేవలం తాగునీరు మాత్రమే కాకుండా.. రైల్వే స్టేషన్లలో కనీస అవసరాల పరిస్థితి కూడా అత్యంత దయనీయంగా ఉందని తేలింది. ఆడిట్ చేసిన మొత్తం 512 స్టేషన్లలో దాదాపు 89 శాతానికి పైగా అంటే 458 స్టేషన్లలో నిబంధనల ప్రకారం ఉండాల్సిన మౌలిక వసతులు కల్పించలేదని తేలింది. దేశంలోని ఎన్‌ఎస్‌జీ-1 కేటగిరీకి చెందిన సీఎస్‌ఎమ్‌టీ, హౌరా, సీల్దా, న్యూఢిల్లీ, ముంబై సెంట్రల్ వంటి అత్యంత రద్దీ ఉండే స్టేషన్లలో సైతం కూర్చోవడానికి సరైన బల్లలు, టాయిలెట్స్, చెత్తాచెదారం వేసే డస్ట్ బిన్‌లు,ఎలక్ట్రానిక్ ట్రైన్ ఇండికేటర్ బోర్డుల కొరత ఉన్నట్లు వెల్లడైంది. 

పాసింజర్ అమెనిటీస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ విశ్లేషణ ప్రకారం దేశవ్యాప్తంగా వందలాది స్టేషన్లలో మరుగుదొడ్లు, మూత్రశాలలు, తాగునీటి కుళాయిల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. 2018 నాటికే అన్ని స్టేషన్లలో కనీస వసతులు కల్పించాలని రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఆచరణ శూన్యంగా మారింది. వాటర్ సప్లై సిస్టమ్స్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని, యునిఫైడ్ డ్రింకింగ్ వాటర్ క్వాలిటీ ప్రొటోకాల్ ప్రకారం సమగ్ర పరీక్షలు నిర్వహించాలని కాగ్ రైల్వే శాఖను గట్టిగా హెచ్చరించింది. ప్రయాణికుల ప్రాణాలను రక్షించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని హెచ్చరించింది.