షర్మిల అరెస్టుపై కోర్టుకెళ్తాం.. ఆమె సిట్ ఆఫీసుకు వెళ్తే సమస్యేంటీ

షర్మిల అరెస్టుపై కోర్టుకెళ్తాం.. ఆమె సిట్ ఆఫీసుకు వెళ్తే సమస్యేంటీ

వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని ఆమె తల్లి విజయమ్మ ప్రశ్నించారు. తాను పోలీసులపై దాడి చేశానన్న వార్తలను ఖండించిన ఆమె.. పోలీసులపై ఎలాంటి దాడి చేయలేదని స్పష్టం చేశారు. కేవలం అరెస్టు చేస్తుంటే వారిని అడ్డుకున్నానని వివరించారు. వైఎస్ షర్మిల అరెస్టుపై కోర్టులో పిటిషన్ వేస్తామని ఈ సందర్భంగా విజయమ్మ తేల్చి చెప్పారు. ఆమె సిట్ దగ్గరకు వెళ్తుంటే అరెస్ట్ చేశారని, అసలు షర్మిల సిట్ ఆఫీస్ కు వెళ్తే సమస్యేంటీ అని ప్రశ్నించారు.

సర్కార్ ను ప్రశ్నించినందుకే వైఎస్ షర్మిలను అరెస్టు చేశారని విజయమ్మ ఆరోపించారు. ప్రశ్నించే గొంతును ఈ ప్రభుత్వం అణిచివేస్తోందని విమర్శించారు. షర్మిలను ఎందుకు అరెస్ట్ చేశారంటే పోలీసుల దగ్గర్నుంచి ఎలాంటి సమాధానం లేదని ఆమె చెప్పారు. ఇంకా ఎంతకాలం షర్మిలను అడ్డుకుంటారు అంటూ విజయమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతకుముందు వైఎస్ఆర్టీపీ అఫీసు ముందు ఆ  పార్టీ చీఫ్  షర్మిలను  పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసులపై చేయి చేసుకున్నందుకు షర్మిలపై పోలీసులు 4 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.  మహిళా కానిస్టేబుల్ తో  పాటుగా ఎస్ ఐ రవీందర్ పై షర్మిల చేయి చేసుకున్నారు. దీనిని సీరియస్ గా తీసుకున్న పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

ఈ నేపథ్యంలో ఆమెను కలవడానికి షర్మిల తల్లి విజయమ్మ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. కానీ.. పోలీసులు ఆమెను అడ్డుకోవడంతో.. విజయమ్మ పోలీస్ స్టేషన్ ఎదుటే నిరసన తెలుపారు. అనంతరం పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తన బిడ్డను కలవడానికి కూడా ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని విజయమ్మ, పోలీసులను నిలదీశారు. అసలు తనను ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టేషన్ లో ఉన్న కుమార్తెను పరామర్శిస్తే తప్పేంటనీ విజయమ్మ పోలీసులను ప్రశ్నించారు. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసే హక్కు కూడా తెలంగాణలో లేదా అంటూ ఆమె మండిపడ్డారు. ఈ క్రమంలో ఆమెతోపాటు భారీ సంఖ్యలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు సైతం తరలివచ్చారు.