వెలుగు బిజినెస్ డెస్క్: అదానీ ఎంటర్ప్రైజస్ లిమిటెడ్ షేరు ధర దారుణంగా పడిపోతుండటంతో ఫాలో ఆన్ పబ్లిక్ఆఫరింగ్ (ఎఫ్పీఓ) డబ్బులు ఇన్వెస్టర్లకు వెనక్కి ఇచ్చేయనున్నట్లు అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ప్రకటించారు. బుధవారం జరిగిన డైరెక్టర్ల బోర్డు మీటింగ్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అనూహ్యమైన పరిణామాలు, మార్కెట్లో ఒడిదుడుకుల నేపథ్యంలో, ఇన్వెస్టర్ల ప్రయోజనాలు కాపాడేందుకు ఎఫ్పీఓ డబ్బు వెనక్కి ఇచ్చేయాలని నిర్ణయించామని, ఈ ట్రాన్సాక్షన్ మొత్తాన్ని ఉపసంహరించుకుంటున్నామని అదానీ ఎంటర్ప్రైజస్ లిమిటెడ్ ఒక స్టేట్మెంట్లో తెలిపింది. షేర్ల ధరలు ఆగకుండా పడిపోతున్న కారణంగా ఎఫ్పీఓతో ముందుకు వెళ్లడం నైతికంగా సరైనది కాదని డైరెక్టర్ల బోర్డు భావించినట్లు గౌతమ్ అదానీ వెల్లడించారు. ఇన్వెస్టర్ల ప్రయోజనాలే తమకు ఎల్లప్పుడూ ముఖ్యమని, వారి ప్రయోజనాలను పరిరక్షించేందుకే ఎఫ్పీఓతో కొనసాగరాదనే నిర్ణయానికి బోర్డు వచ్చిందని చెప్పారు. రిటెయిల్ ఇన్వెస్టర్లు దూరంగా ఉన్నా, అదానీ ఎంటర్ప్రైజస్ ఎఫ్పీఓ రూ. 20 వేల కోట్లు సమీకరించడంలో సక్సెసయింది. నాన్ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు, హైనెట్వర్త్ ఇండివిడ్యువల్స్కి చెందిన ఫ్యామిలీ ఆఫీసులు మద్దతుగా రావడం వల్లే ఈ ఎఫ్పీఓ సక్సెస్ సాధించింది. ఎఫ్పీఓ ఫండ్స్ను తిరిగి ఇచ్చేందుకు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్స్తో కలిసి పనిచేస్తున్నట్లు అదానీ ప్రకటించారు. అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ రిపోర్టుతో అదానీ ఎంటర్ప్రైజస్ ఎఫ్పీఓ ఇబ్బందులెదుర్కొన్న విషయం తెలిసిందే.
సెబీ పరిశీలనలో అదానీ...రాయిటర్స్ రిపోర్టు
ఎఫ్పీఓలో అవకతవకలు ఏవైనా జరిగాయా అనే అంశాన్ని , షేర్ల పతనం ఎందుకనే విషయాన్నీ సెబీ పరిశీలిస్తోందని బుధవారం రాయిటర్స్ ఒక రిపోర్టు పబ్లిష్ చేసింది. గత అయిదు ట్రేడింగ్ సెషన్లలోనూ కలిపి అదానీ గ్రూప్లోని 10 లిస్టెడ్ కంపెనీలూ రూ. 7.5 లక్షల కోట్ల మార్కెట్ విలువను పోగొట్టుకున్నాయి. ఒక్క అదానీ ఎంటర్ప్రైజస్నే చూస్తే 50 శాతం నష్టపోయి 52 వారాల కనిష్టానికి చేరింది. దీంతో కొన్నేళ్లపాటు సాగిన ర్యాలీకి బ్రేకు పడింది.
అదానీ గ్రూప్లోని కంపెనీల షేర్లకు అంత విలువ అవసరం లేదని, వాటి ధరలు ఉండాల్సిన దానికన్నా 85 శాతం ఎక్కువగా ఉన్నాయనే సంచలన ఆరోపణలను హిండెన్బర్గ్ చేసింది. మా బాలెన్స్ షీట్ పటిష్టంగా ఉంది. క్యాష్ ఫ్లోకు కూడా ఇబ్బంది లేదు. అప్పులపై వడ్డీలు చెల్లించడంలో మాకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. మా ఆపరేషన్స్పై లేదా ఫ్యూచర్ ప్లాన్లపై తాజా డెసిషన్ ఎఫెక్ట్ ఏమీ ఉండదు. లాంగ్ టర్మ్ వాల్యూ క్రియేషన్పై ఫోకస్ కొనసాగుతుంది. ఇంటర్నల్ అక్రూవల్స్ నుంచే గ్రోత్ సాధిస్తాం. మార్కెట్ సాధారణ స్థితికి వచ్చాక క్యాపిటల్ మార్కెట్ స్ట్రేటజీని రివ్యూ చేస్తాం.
-గౌతమ్ అదానీ