కోల్కత్తా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీని గవర్నర్ ఆర్ఎన్ రవి రద్దు చేశారు. దీంతో.. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ పాలనకు అధికారికంగా తెర పడింది. సీఎం పదవికి రాజీనామా చేసేందుకు దీదీ ససేమిరా అనడంతో గవర్నర్ తనకు ఉన్న అధికారంతో అసెంబ్లీని రద్దు చేస్తూ గెజిట్ విడుదల చేశారు.
Governor of West Bengal, RN Ravi, has issued an Order dissolving the West Bengal Legislative Assembly with effect from 07 May 2026. pic.twitter.com/IuEAylWege
— ANI (@ANI) May 7, 2026
పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ప్రభుత్వ పదవీ కాలం మే 7 (గురువారం)తో ముగిసింది. గవర్నర్ అసెంబ్లీని రద్దు చేస్తూ గెజిట్ విడుదల చేయడంతో మే 9న బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది.
పశ్చిమ బెంగాల్లో కొలువుదీరనున్న మొట్టమొదటి బీజేపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముహూర్తం ఖరారైన సంగతి తెలిసిందే. మే 9న కోల్కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్లో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య ఒక ప్రకటన విడుదల చేశారు. మే 9న ఉదయం10 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ హాజరుకానున్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రమాణస్వీకారానికి ఎంచుకున్న తేదీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆ రోజున బెంగాల్ ఆరాధ్య దైవం, నోబెల్ విజేత రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. బీజేపీని ‘బయటి వ్యక్తుల పార్టీ’గా చిత్రించే టీఎంసీ ప్రయత్నాలకు కౌంటర్గా బెంగాల్ సంస్కృతి, అస్తిత్వంతో పార్టీని మమేకం చేయడమే లక్ష్యంగా ఈ తేదీని ఎంచుకున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేల సమావేశాన్ని మే 8న సాయంత్రం నిర్వహించనున్నారు. ఈ మీటింగ్లో శాసనసభాపక్ష నేతను అధికారికంగా ఎన్నుకుంటారు.
