శంషాబాద్, వెలుగు: రాజేంద్రనగర్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రకాశ్ గౌడ్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని బీజేపీ అభ్యర్థి తోకల శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. శంషాబాద్ మున్సిపాలిటీలో మంగళవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సిద్ధాంతి హైవేపై ఉన్న కట్టమైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సిద్ధాంతి యాదవ బస్తీ రైల్వే గేట్, పోచమ్మగడ్డ, హైమద్ నగర్, కాపుగడ్డ, మధురానగర్, రాళ్లగూడ, శంషాబాద్ లోని ఆర్బీనగర్లో తోకల శ్రీనివాస్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజేంద్రనగర్ సెగ్మెంట్కు ఏం చేశారో చెప్పే ధైర్యం ప్రకాశ్ గౌడ్కు లేదన్నారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం మైలార్ దేవ్ పల్లిలో శ్రీనివాస్ రెడ్డి ఇంటి వద్ద ఇతర పార్టీలకు చెందిన 150 మంది నేతలు బీజేపీలో చేరారు.