మనీ లాండరింగ్​ నిరోధక చట్టంలో సెక్షన్​ 50 ఏం చెబుతోంది?

మనీ లాండరింగ్​ నిరోధక చట్టంలో సెక్షన్​ 50 ఏం చెబుతోంది?

మనీలాండరింగ్​ నిరోధక చట్టం ఇటీవలి కాలంలో విశేష ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ చట్టం 2002లో ఆమోదం పొందింది. మాదకద్రవ్యాలు, చట్టవిరుద్ధమైన పదార్థాలు, ఉగ్రవాదం, అవినీతి, ఇతర వ్యవస్థీకృత నేరాలకు సంబంధించి అనేక విషయాలు ఈ చట్ట పరిధిలోకి వస్తాయి. ఈ నేరాల ద్వారా వచ్చే ఆదాయం పెద్ద మొత్తంలో అంతర్జాతీయంగా తరచూ లాండరింగ్​చేయబడుతుంది. ఇది దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. వాటిని నిరోధించే విధంగా ఈ చట్టం రూపుదిద్దుకుంది. ఆయా నేరాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని స్వాధీనం చేసుకోవడం, వాటికి పాల్పడిన వ్యక్తులను శిక్షించడం ఈ చట్టం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చట్టం నిర్దేశించిన లక్ష్యాలను డైరెక్టరేట్​ఆఫ్​ ఎన్​ఫోర్స్​మెంట్(ఈడీ) అమలు చేస్తుంది. ఇది కేంద్ర ప్రభుత్వ రెవెన్యూ శాఖలోని ఆర్థిక దర్యాప్తు సంస్థ. సమన్లు జారీ చేయడం స్టేట్​మెంట్లు తీసుకోవడం, సోదాలు చేయడం, విచారణ జరపడం, ఆస్తులను స్వాధీనం చేసుకోవడం వంటి చర్యలు ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ చేయొచ్చు. 

దర్యాప్తు అధికారం కలిగి ఉన్నప్పటికీ, దీన్ని పోలీస్ ఏజేన్సీగా పరిగణనలోకి తీసుకోరు. మనీ లాండరింగ్​నిరోధక చట్టంలోని సెక్షన్​50 ప్రకారం వ్యక్తులకు సమన్స్ ఇచ్చే అధికారం ఈడీ అధికారులకు ఉన్నది. సాక్షులు కావొచ్చు, అనుమానితులు కావొచ్చు, నేరస్తులు కావొచ్చు, డాక్యుమెంట్స్​ తీసుకొని రమ్మని, సాక్ష్యం ఇవ్వమని సమన్స్​ జారీ చేసే అధికారం ఈడీ ఆఫీసర్లకు ఉన్నది. వాటిని జారీ చేసే అధికారం డైరెక్టర్, అదనపు డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్​డైరెక్టర్​స్థాయి అధికారులకు ఉంటుంది. ఈ సమన్స్​అందుకున్న వ్యక్తి సత్యమే చెప్పాల్సి ఉంటుంది. దోష పూరిత స్వభావం ఉన్న ప్రశ్నలకు కూడా సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. సమాధానాలు చెప్పకపోయినా, తప్పుడు సమాధానాలు చెప్పినా అది అదే చట్టంలోని సెక్షన్​63 ప్రకారం నేరమవుతుంది. ఈ నిబంధన రాజ్యాంగం ప్రసాదించిన స్వీయనేరారోపణ వ్యతిరేక హక్కుకు వ్యతిరేకం అన్న వాదన కూడా ఉన్నది.

ఆర్టికల్​20(3)కి వ్యతిరేకంగా సెక్షన్​50?

మనీలాండరింగ్ ​నిరోధక చట్టంలోని సెక్షన్​50 అనేది రాజ్యాంగం ప్రసాదించిన ఆర్టికల్​20(3) హక్కుకు విఘాతం కలిగించడం లేదా? అన్న ప్రశ్న వస్తుంది. ఈడీ, తమకు సెక్షన్​50 ప్రకారం సమన్స్​ఇవ్వడాన్ని దాల్మియా సిమెంట్​ లిమిటెడ్ వర్సెస్​ ఇతరుల కేసులో పిటిషనర్లను ఆంధ్రప్రదేశ్ ​హైకోర్టులో ప్రశ్నిస్తూ ఇది రాజ్యాంగ వ్యతిరేకమని వాదనలు చేశారు. సమన్స్​జారీ చేసినప్పుడు అధికారికంగా ఎట్లాంటి ఆరోపణలు చేయలేదని కోర్టు పేర్కొంది. ఐసీఐఆర్(ఎన్​ఫోర్స్​మెంట్ ​కేసు ఇన్ఫర్మేషన్​ రిపోర్టు) నమోదు చేయబడిందని పిటిషనర్లు వాదించారు. పిటిషనర్లు నిందితులు కాదని, వారు కేవలం అనుమానితులని ఈడీ వాదించింది. ఈ సీఐఆర్ అనేది ఎఫ్ఐఆర్​తో సమానం కాదని కోర్టు అభిప్రాయపడింది. విజయ్​మండల్​ చౌదరీ వర్సెస్​ యూనియన్ ఆఫ్​ ఇండియా కేసులో సుప్రీంకోర్టులో త్రిసభ్య బెంచ్​ తీర్పును ప్రకటిస్తూ మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని ముఖ్యమైన నిబంధనలన్నీ రాజ్యాంగబద్ధమేనన్న తీర్పు 2022 జులైలో ప్రకటించింది. అందులో సెక్షన్​50 కూడా ఉంది. సెక్షన్​50 కింద సమన్లు పంపినప్పుడు, రెండు కారణాల వల్ల రాజ్యాంగంలోని ఆర్టికల్​20(3) ఇచ్చిన రక్షణను పొందలేరు. అప్పటికి ప్రాసిక్యూషన్​ఫిర్యాదును దాఖలు చేయలేదన్నది మొదటి కారణం. సమన్స్​ పంపిన సమయంలో వారు కేవలం అనుమానితులుగా ఉన్నారు. ఇది ఒక రకంగా రాజ్యాంగంలోని ఆర్టికల్​20(3) ద్వారా ఇచ్చిన హక్కుకు భంగం కలిగించడమే. సెక్షన్​50 ప్రకారం సమన్స్​ అందుకున్న వ్యక్తి తనను తాను నేరంలో పేర్కొంటూ స్టేట్​మెంట్​ఇచ్చే అవకాశం ఉంది. ఆ ప్రకటన ఆధారంగా అతనిపై ప్రాసిక్యూషన్ ​కేసును దాఖలు చేయవచ్చు. విజయ్​ మండల్​ చౌదరి కేసు సుప్రీంకోర్టు పున: పరిశీలనలో ఉంది. అప్పటి వరకు ఈ నిబంధన ప్రకారం అందరూ నడవాల్సిందే. ఈ నిబంధన ప్రకారమే ఈడీ అధికారులకు సివిల్​కోర్టు అధికారాలు ఉంటాయి. ఈ ప్రొసీడింగ్​అన్నీ జ్యుడీషియల్​ ప్రొసీడింగ్స్. తప్పుడు సాక్ష్యం ఇచ్చిన వ్యక్తుల మీద కేసులు పెట్టే అవకాశం ఉంది. క్రిమినల్​ ప్రొసీజర్ కోడ్​ఈ నేరాలకు వర్తించదు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని సె.160 లో చెప్పిన విషయాలు ఈ కేసులకి వర్తించవు. మనీ లాండరింగ్ చట్టం ఓ కఠిన చట్టం. కఠినమైన నిబంధనలు. అయితే ఈ చట్టం కింద గత 17 ఏండ్లలో 400 అరెస్టులు జరిగాయి. కానీ శిక్షలు పడింది 25 మందికే.

రాజ్యాంగంలోని ఆర్టికల్​20(3)

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్​20(3) ప్రకారం ప్రతి వ్యక్తి తనకు తాను వ్యతిరేకంగా నేరారోపణ చేసుకోవడాన్ని నిషేధిస్తుంది. నేరానికి పాల్పడిన వ్యక్తిని అతనికి వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వమని బలవంతం చేయకూడదు. ఒక వ్యక్తిని అధికారికంగా ఆరోపణలు వచ్చినప్పుడు మాత్రమే ఆ నేరంలో ముద్దాయి అని అనుకోవాల్సి ఉంటుంది. ఎంపీ శర్మ వర్సెస్ సతీశ్​చంద్ర కేసులో దరఖాస్తుదారులకు ఆర్టికల్​20(3)తో రక్షణ లభిస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఎందుకంటే వాళ్ల పేర్లు ప్రథమ సమాచార నివేదికల్లో ఉన్నాయి. అదే విధంగా నిందితుడు స్టేట్​మెంట్​ఇచ్చే సమయంలో తప్పనిసరిగా నిందితుడి పాత్రలో ఉండాలని సుప్రీంకోర్టు స్టేట్​ఆఫ్​ ముంబాయి వర్సెస్ కతికలు ఒఘడు (ఏఐఆర్​196 సుప్రీంకోర్టు 1808) కేసులో పేర్కొంది. స్టేట్​మెంట్​తీసుకున్న తర్వాత ఆ వ్యక్తి నిందితుడిగా మారితే సరిపోదని సుప్రీంకోర్టు పేర్కొంది. సుప్రీంకోర్టు ఈ కేసులో చూపిన వ్యత్యాసం చాలా ముఖ్యమైనది. ఈ సాంకేతిక లొసుగును దర్యాప్తు చేసే అధికారులు ఉపయోగించుకునే అవకాశం ఉన్నది. నేర సమాచారం అందినప్పుడు, దర్యాప్తు అధికారి నేరంతో సంబంధం ఉన్న వ్యక్తులను పిలిపించి వారి మీద అధికారిక ఆరోపణలు చేయకుండా వారి స్టేట్​మెంట్లను తీసుకోవచ్చు. ఆ విధంగా ఆ వ్యక్తి రాజ్యాంగంలో చెప్పిన ఆర్టికల్ 20(3) రక్షణను పొందకుండా నిరోధించవచ్చు. వారి స్టేట్​మెంట్​ఆధారంగా వారిని నిందితులని చేసి ఆ తర్వాత ఫిర్యాదుని దాఖలు చేసే అవకాశం ఉంది. దాని వల్ల రాజ్యాంగ రక్షణ అనేది పక్కదారి పట్టే అవకాశం ఉంది. వారు రక్షణను క్లెయిమ్​ చేసుకునే పరిస్థితి పోతుంది.

నిందితుడి స్టేట్​మెంట్​  తీసుకోవచ్చా?


మనీ లాండరింగ్​యాక్ట్​లోని సెక్షన్​50ని గమనించినప్పుడు.. ఈ నిబంధన సాక్షి, నిందితుడికి మధ్య తేడా గుర్తించదు. సాక్షికి, నిందితుడికి సమన్స్​ పంపడానికి ఈ సెక్షన్​అనుమతి ఇస్తుంది.  రమేశ్​చంద్ర మెహతా వర్సెస్​ స్టేట్​ఆఫ్​ బెంగాల్​ కేసులో సుప్రీంకోర్టు ‘ఎవరైనా వ్యక్తి’ అన్ని పదబంధంలో ముద్దాయి కూడా అన్న అర్థం ఉంటుందని స్పష్టం చేసింది. అందుకని సెక్షన్​50లో చెప్పిన ‘ఏ వ్యక్తి అయినా’ అన్న పదబంధం ప్రకారం సాక్షిని పిలవవచ్చు. ముద్దాయిని కూడా పిలవవచ్చు. ఈ సమన్స్​ అందుకున్న వ్యక్తికి తనను ఏ స్థాయిలో పిలిచారో తెలియదు. సెక్షన్​50 ప్రకారం నిందితుడి స్టేట్​మెంట్​ను కూడా ఈడీ అధికారులు నమోదు చేయవచ్చు.

- డా. మంగారి రాజేందర్, జిల్లా జడ్జి(రిటైర్డ్)