- శంషాబాద్ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. మృతుల్లో ముగ్గురు చిన్నారులు
- అందరూ సిరిసిల్ల వాసులు.. ఒకే కుటుంబానికి చెందినవారు
- దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా విషాదం
- రోజంతా ప్రయాణం, ఎండ వేడితో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి
- నిద్ర పోవడమే యాక్సిడెంట్కు కారణం!
ఎల్బీనగర్/గండిపేట్, వెలుగు:రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని తొండుపల్లి ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ర్)పై ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టగా.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి, స్వర్ణగిరి క్షేత్రాలను దర్శించుకుని తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. మృతుల్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు. కారులో మొత్తం ఏడుగురు ఉండగా, ఓ మహిళ తీవ్ర గాయాలతో బయటపడ్డారు.
సనత్నగర్లో నివాసముంటున్న బొల్లి శివకుమార్ (37) తన కారులో భార్య లావణ్య (లాస్య)(33), కూతురు బొల్లి రిషిత(7), బావ కొడెం శ్రీనివాసులు(39), సోదరి కొడెం శ్వేత, వారి పిల్లలు కొడెం కృష్ణ చైతన్య చంద్ర(11), కొడెం మాధవ్(9)తో కలిసి యాదగిరిగుట్టకు వెళ్లి తిరుగు ప్రయాణమయ్యాడు. మధ్యాహ్నం సుమారు 3:30 నుంచి 4 గంటల మధ్య రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం తొండుపల్లి ఓఆర్ఆర్ ఎగ్జిట్ 16 దగ్గరకు రాగానే, డ్రైవింగ్ చేస్తున్న శివకుమార్కు ఒక్కసారిగా కన్నంటుకుంది.
దీంతో ఎడమ వైపున ఆగి ఉన్న లారీని ఢీకొట్టాడు. వేగానికి కారు లారీ కిందికి దూసుకెళ్లి పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో బొల్లి శివకుమార్, బొల్లి లాస్య, బొల్లి రిషిత, కొడెం శ్రీనివాసులు, కొడెం కృష్ణ చైతన్య చంద్ర, కొడెం మాధవ్ అక్కడికక్కడే మృతి చెందారు. కొడెం శ్వేత తీవ్ర గాయాలతో దవాఖానలో చికిత్స పొందుతోంది. సమాచారం అందుకున్న శంషాబాద్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వాహనం పూర్తిగా నుజ్జునుజ్జవ్వడంతో మృతదేహాలను బయటకు తీయడం కష్టతరంగా మారింది. చివరకు అతికష్టం మీద డెడ్బాడీలను బయటికి తీసి ఉస్మానియా దవాఖానకు తరలించారు.
ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ అక్కడ నుంచి పరారైనట్టు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రోజంతా ప్రయాణం చేయడం, ఎండ వేడి వల్ల డ్రైవర్ అలసటతో నిద్రపోవడమే యాక్సిడెంట్కు ప్రధాన కారణమని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఓవర్స్పీడ్లో ఉండడం కూడా ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. మృతులంతా రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఒకే కుటుంబ సభ్యులని, కొన్నేండ్ల కింద హైదరాబాద్లోని సనత్నగర్కు వచ్చి స్థిరపడ్డారని పోలీసులు చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచే యాదగిరిగుట్టకు వెళ్లారని తెలిపారు. సంఘటనా స్థలాన్ని చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ పరిశీలించారు.
- లారీ ఆపి టార్ఫాలిన్కప్పుతుండగా..
టార్ఫాలిన్ జారిపోవడంతో సరుకు పడిపోతుందని ఓఆర్ఆర్ లోని ఎమర్జెన్సీ వే లో లారీని డ్రైవర్ఆపాడు. దీంతో ఓవర్స్పీడ్లో ఉన్న శివకుమార్నిద్రలోకి జారుకోవడంతో గమనించలేదు. వేగంగా వెళ్లి ఢీకొట్టడంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కాగా, ఘటనపై ఫ్యూచర్ సిటీ అడ్మిన్ జాయింట్ సీపీ చందనా దీప్తి స్పందించారు. ప్రమాద ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నామని చెప్పారు. ప్రమాదం జరిగిన సమయానికి ముందు టోల్గేట్వద్ద, ఓఆర్ఆర్ పై ఉన్న సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నామని చెప్పారు. కాగా, సిరిసిల్ల బీఆర్ఎస్ లీడర్ బొల్లి రామ్మోహన్కు శివకుమార్ సోదరుడు కావడం.. ఆ కుటుంబమంతా మరణించడంతో కేటీఆర్ తీవ్ర
దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
