
కొన్నాళ్ల క్రితం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వెళ్లారు. అప్పుడు మియావాకి విధానంలో మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. గతంలో కుంభమేళాకు ముందు ప్రయాగ్రాజ్లో కూడా ఈ పద్ధతిలోనే చిన్న చిన్న అడవులను పెంచారు. అంతెందుకు తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ పద్ధతిలో మొక్కలు నాటి అడవిని సృష్టిస్తున్నారు. ప్రపంచంలో ఎన్నో దేశాలు ఈ టెక్నిక్ని పాటిస్తున్నాయి. ఇంతకీ ఈ ‘మియావాకి’ ఎక్కడినుంచి వచ్చింది? దీనివల్ల లాభమేంటి?
వ్యవసాయం చేయకుండా వదిలేసిన భూమిలో దట్టమైన చెట్లు, జీవ వైవిధ్యం పెరిగి సహజంగా అడవి ఏర్పడాలంటే సుమారు వంద నుంచి రెండు వందల సంవత్సరాలు పడుతుంది. ఈ క్రమంలో పక్షులు అడవిలో తెగుళ్ళను నియంత్రిస్తాయి. కీటకాలు పరాగ సంపర్కం జరిగేలా చేస్తుంటాయి. శిలీంధ్రాలు చెట్ల ఆరోగ్యాన్ని కాపాడతాయి. అలా ప్రతి జీవికి ఒక పాత్ర ఉంటుంది. అవన్నీ ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి.
ఇలా అడవి తనను తాను చూసుకోగల ఆరోగ్యకరమైన, జీవవైవిధ్య ఆవాసాన్ని నిర్మించుకుని.. స్వయం సమృద్ధిగా మారుతుంది. మనుషులు ఆ ప్రక్రియలకు అడ్డు తగలకుండా ఉంటే చాలు. వాటినవే కాపాడుకుంటాయి.కానీ.. మనిషి తన స్వార్థం కోసం అడవులను మాయం చేస్తున్నాడు. దానివల్ల పర్యావరణానికి ఎంత నష్టం కలుగుతుందో చూస్తూనే ఉన్నాం. అందుకే మనుషులు చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా మళ్లీ అడవులు పెంచాలి అంటున్నారు పర్యావరణవేత్తలు. అడవులను వేగంగా పెంచేందుకే ఈ మియావాకి టెక్నిక్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.
తక్కువ టైంలో..
మియావాకి అనేది తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలను పెంచగలిగే జపాన్ టెక్నిక్. ఈ విధానంలో మొక్కలు పెంచడం వల్ల వేగంగా పెరగడమే కాకుండా దట్టమైన అడవుల్లా మారుతాయి. ఈ అటవీకరణ పద్ధతిని జపనీస్ వృక్షశాస్త్రజ్ఞుడు, ప్రొఫెసర్ అకిరా మియావాకి డెవలప్ చేశాడు. దీని ద్వారా 20–30 సంవత్సరాల్లోనే 100 శాతం సేంద్రియ, వైవిధ్యమైన అడవులను సృష్టించవచ్చు. మియావాకి అడవులు మోనోకల్చర్ (ఒకే జాతికి చెందిన మొక్కలు) అడవుల కంటే 10 రెట్లు వేగంగా పెరుగుతాయి.
చాలా దట్టంగా ఉంటాయి. పురాతన, ఆదిమ అడవుల మాదిరిగానే చాలా ఎక్కువ జీవవైవిధ్యం ఉంటుంది. మూడు సంవత్సరాలపాటు మొక్కలను కాపాడుకుంటే చాలు. ఆ తర్వాత అటు వైపు వెళ్లాల్సిన అవసరమే లేదు. ఈ పద్ధతిలో 9 చదరపు మీటర్ల చిన్న ప్లేస్లో కూడా అడవిని క్రియేట్ చేయొచ్చు.
లోకల్ మొక్కలే నాటాలి
మియావాకి పద్ధతిలో ఎక్కడ మొక్కలు నాటుతున్నామో అక్కడి వాతావరణంలో సహజంగా పెరిగే జాతులనే ఎంపిక చేస్తారు. దీనిని పొటెన్షియల్ నేచురల్ వెజిటేషన్ అంటారు. అలాంటి మొక్కలను గుర్తించడానికి సైంటిస్ట్లు ఇంటెన్సివ్ రీసెర్చ్ చేస్తారు. అక్కడి ప్రజల అభిప్రాయాలు తీసుకుంటారు. స్థానికంగా ఉన్న పురాతన అడవుల్లో చెట్లను పరిశీలిస్తారు. అలా చివరకు వీలైనన్ని ఎక్కువ జాతుల మొక్కలు ఉండేలా సెలక్ట్ చేస్తారు.
వాటిని నాటేటప్పుడు పెద్ద గోతులు తవ్వి అందులో మొక్కల ఎదుగుదలకు అవసరమైన కంపోస్ట్, సారవంతమైన మట్టి వేస్తారు. ఒక్కో మొక్క మధ్యన అడుగు నుంచి అడుగున్నర దూరం మాత్రమే ఉంటుంది. ఒక మొక్క ప్రభావం మరో మొక్కపై పడకుండా ఉండేందుకు పందిరి జాతి మొక్కలు, సాధారణ వృక్ష జాతులు, పొదల్లా పెరిగే మొక్కలు, చాలా పొడవుగా పెరిగేవి పక్కపక్కనే నాటుతారు.అంటే చిన్న, మధ్యస్థం, పెద్ద, పొట్టి మొక్కలను కలిపి ఒకే చోట నాటుతారు అన్నమాట.
లాభాలెన్నో..
ఈ పద్ధతిలో తక్కువ భూమి అందుబాటులో ఉండే పట్టణ ప్రాంతాల్లో కూడా దట్టమైన అడవులను పెంచొచ్చు. ఖర్చు, నిర్వహణ వ్యయం చాలా తక్కువ. చెట్ల వల్ల వర్షపు నీరు భూమిలోకి బాగా ఇంకుతుంది. దానివల్ల ఎక్కువ నీటి వినియోగం ఉండే సిటీల్లో నీటి ఎద్దడిని తగ్గించవచ్చు. అన్ని రకాల పక్షులు, జంతువులకు ఈ అడవులు ఆవాసంగా మారతాయి. గాలిలో ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. వరదల ప్రమాదం తగ్గుతుంది. ఈ పద్ధతి నేల నాణ్యతను మెరుగుపరుస్తుంది. అటవీ అభివృద్ధిని వేగవంతం చేస్తుంది. మియావాకి టెక్నిక్ ఉపయోగించి నాటిన చెట్లు ఎక్కువ కార్బన్ను గ్రహిస్తాయి.
సంప్రదాయ అడవులతో పోలిస్తే ఎక్కువ జీవవైవిధ్యం డెవలప్ అవుతుంది. అలహాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వృక్షశాస్త్ర మాజీ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్.బి. సింగ్ చెప్పినదాని ప్రకారం.. ఈ పద్ధతిని ఉపయోగించి దట్టమైన అడవులు పెంచడం వల్ల వేసవిలో పగలు, రాత్రి మధ్య ఉష్ణోగ్రత వ్యత్యాసాన్ని తగ్గించవచ్చు. ఈ పద్ధతిలో పెద్ద అడవులు పెంచితే అవి టెంపరేచర్లను 4 నుంచి 7 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గించగలవు.