
ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంది అనుకుంటున్న టైంలో.. ఉమురు, మెరుపు లేకుండా అర్థరాత్రి సమయంలో ఇరాన్ దేశంపై విరుచుకుపడింది ఇజ్రాయిల్. రెండు దేశాల మధ్య కొన్నేళ్లుగా టెన్షన్స్ నెలకొన్నా.. డైరెక్ట్ ఎటాక్ జరగలేదు. ఇప్పుడు అది జరిగింది. ఇరాన్ పై ఇజ్రాయిల్ యుద్ధం చేయటానికి కారణాలు ఏంటీ.. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో.. ఇరాన్ పై ఇజ్రాయెల్ ఎందుకు ఎటాక్ ఎందుకు చేసిందో తెలుసుకుందాం..
ఇరాన్ పై ఎప్పుడు,, ఎక్కడ దాడులు జరిగాయి..?
ఇరాన్ రాజధాని టెహ్రాన్. ఇరాన్ టైం ప్రకారం అర్థరాత్రి దాటిన తర్వాత.. సరిగ్గా 3 గంటల 30 నిమిషాల సమయంలో పేలుళ్లు జరిగాయి. టెహ్రాన్ సిటీకి దక్షిణం వైపు 225 కిలోమీటర్ల దూరంలో ఉన్న నటాంజ్ అనే అణు కేంద్రంపై ఇజ్రాయిల్ విమానాలు బాంబులు, మిస్సైల్స్ వేశాయి. సరిగ్గా ఇదే సమయంలో రాజధాని టెహ్రాన్ సిటీలోని ఈశాన్యం వైపు జనం నివసించే ఇళ్లపైన కూడా ఇజ్రాయెల్ ఎటాక్ చేసింది. హైరైజ్ భవనాలను టార్గెట్ చేసి మరీ మిస్పైల్స్ ప్రయోగించింది. దీంతో పలు హైరైజ్ టవర్లు దెబ్బతిన్నాయి.
ఇరాన్ ఏం చెబుతుంది..?
ఇరాన్ దేశంపై ఇజ్రాయెల్ దాడులు కచ్చితంగా దుందుడుకు చర్యలే. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 100 డ్రోన్ బాంబులతో మా దేశంపై దాడి చేసింది. ఇరాన్ దేశ ప్రజలపై యుద్ధం ప్రకటించినట్లుగానే చూస్తున్నాం. ఇజ్రాయెల్ దాడులను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. మా సైన్యం పూర్తి స్థాయిలో.. శక్తి వంచన లేకుండా కృషి చేస్తుంది. ఇప్పటికే టెహ్రాన్ లోని జనం నివాస ప్రాంతాలపై దాడులు జరిగాయి. చాలా మంది గాయపడ్డారు అని స్పష్టం చేసింది. ఇరాన్ దేశం ఏం చేయాలో.. ఏం చేయకూడదో మరో దేశం నిర్ణయించే అధికారం ఎక్కడిది అని ప్రశ్నించింది ఇరాన్. దీనికి అమెరికా కూడా బాధ్యత వహించాల్సిందే అంటూ ఇరాన్ ఖరాఖండిగా తేల్చిచెప్పింది.
ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ దేశంలోనే అత్యంత శక్తివంతమైన ఇరాన్ పారామిలిటరీ రివల్యూషనరీ గార్డ్ అధినేత జనరల్ హుస్సేన్ చనిపోయినట్లు తెలిపింది. అంతేకాకుండా ఇరాన్ ఆర్మీ చీఫ్ మొహమ్మద్ బాఘేరి కూడా చనిపోయినట్లు ప్రకటించింది ఇరాన్. వీళ్లిద్దరూ ఇరాన్ ప్రభుత్వంలోనే కాకుండా అక్కడి జనంలోనూ పాపులర్ లీడర్స్ కావటం విశేషం.
ఇజ్రాయెల్ ఏం చెబుతోంది..?
ఇరాన్ దేశం నుంచి వచ్చే ముప్పును ఎదుర్కొనేందుకే ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇరాన్ పై దాడులు కొనసాగుతూనే ఉంటాయి. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ప్రకటించారు. ఇరాన్ పై దాడికి కారణాలు చెబుతూ.. గతంలో ఎప్పుడూ లేని విధంగా పెద్ద ఎత్తున యురేనియం సేకరిస్తుంది.. దీని ద్వారా అణు బాంబులు తయారు చేస్తుందన్నారు నెతన్యాహు. ఇరాన్ అణు కేంద్రాల్లో అణు బాంబుల తయారీని నిలిపివేసేంత వరకు దాడులు కొనసాగుతూనే ఉంటాయని.. ఎన్ని రోజులు అయినా.. ఎన్ని నెలలుగా అయినా ఆపరేషన్ రైజింగ్ లయన్ కొనసాగుతుందని స్పష్టం చేశారాయన.
ప్రస్తుతం ఇరాన్ దేశం దగ్గర ఉన్న యురేనియంతో.. చాలా తక్కువ సమయంలోనే.. అంటే ఏడాదిలోపే అణ్వాయుధాలను తయారు చేయగలదు.. ఇదే జరిగితే ఇజ్రాయెల్ దేశ మనుగుడ ప్రశ్నార్థకం అవుతుంది.. దీన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ చూస్తూ ఊరుకోం.. పక్కా సమాచారం ఆధారంగానే ఈ దాడులు చేస్తున్నట్లు వెల్లడించారాయన. దీనికి అమెరికా దేశం మద్దతు కూడా ఉందని ప్రకటించి కలకలం రేపారు.
ఇరాన్ పై దాడుల్లో మా ప్రమేయం లేదు : అమెరికా
ఇరాన్ దేశంపై.. ఇజ్రాయెల్ దాడులతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది అమెరికా. ఈ విషయంలో జోక్యం చేసుకోవటం లేదంటూ అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో స్వయంగా ప్రకటించారు. ఈ దాడులతో ఎలాంటి సంబంధం లేదని.. ఆ ప్రాంతంలోని అమెరికా బలగాలను రక్షించటం ఒక్క విషయానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు.
ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడులపై ఆస్ట్రేలియా అసంతృప్తి వ్యక్తం చేసింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ప్రమాదకరం అంటూ నోట్ రిలీజ్ చేసింది.