ఐసీసీలో సత్తా ఉన్నోళ్లు లేరా?

ఐసీసీలో సత్తా ఉన్నోళ్లు లేరా?

టీ20 వరల్డ్‌కప్‌‌పై తుది నిర్ణయం ఎప్పుడు?
బోర్డు చైర్మన్ ఎలక్షన్ విషయంలోనూ అదే ధోరణి
ఇంటర్నేషనల్ బాడీపై బీసీసీఐ ఆగ్రహం

మూడున్నర నెలలకాలంలో.. మూడుసార్లు సమావేశమైనా.. టీ20 వరల్డ్ కప్ పై ఐసీసీ ఏటూ తేల్చలేకపోయింది..! ఇంకావేచి చూసే ధోరణితోనే ముందుకెళ్తున్నది..! దీనివల్ల సభ్య దేశాల క్రికెట్ యాక్టివిటీ అస్తవ్యస్తంగా తయారైంది..! కొందరు పాత ఎఫ్టీపీనిఫాలో అవుతుంటే..మరికొందరు ఇంకా టోర్నీలను మొదలుపెట్టడానికి జాప్యం చేస్తున్నారు..! ఐసీసీ వ్యవహరిస్తున్న తీరు..  ఇతర దేశాలపై ఎలా ఉన్నా..బీసీసీఐపై మాత్రం తీవ్ర ప్రభావంచూపుతున్నది..! ఓవైపు ఐపీఎల్ పై ముందుకెళ్లాలన్నా.. బైలేటర్ సిరీస్ల విషయంలో నిర్ణయం తీసుకోవాలన్నామధ్యలో వరల్డ్ కప్ పై ఎలాంటి నిర్ణయం వస్తుందోనన్నసందేహంతో ముందు నుయ్యి.. వెనుకగొయ్యి మాదిరిగా పరిస్థితి తయారైంది..!

న్యూఢిల్లీ: శశాంక్​ మనోహర్​ చైర్మన్​గా బాధ్యతలు చేపట్టినప్పట్నించి.. ఐసీసీతో మొదలైన వివాదాలు ఇప్పుడు తారాస్థాయికి చేరుకున్నాయి. టీ20 వరల్డ్​కప్​పై ఫైనల్​ డెసిషన్​ విషయంలో అంతర్జాతీయ బాడీ వేచి చూసే ధోరణిని అవలంబిస్తుండటంతో బీసీసీఐ మరింత ఆగ్రహంతో ఊగిపోతున్నది. కరోనా వల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో టోర్నీ కుదరదని తెలిసినా.. మెగా ఈవెంట్​ను హోస్ట్​ చేయాల్సిన ఆస్ట్రేలియా తమ వల్ల కాదని చెప్పినా.. తుది నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తుండటంపై బీసీసీఐ తీవ్ర విమర్శలు చేసింది. నిర్ణయాలు తీసుకునే సత్తా ఉన్నోళ్లు ఐసీసీలో లేరా? అంటూ పదునైన వ్యాఖ్యలతో విమర్శించింది. కొత్త చైర్మన్​ విషయంలోనూ ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని ధ్వజమెత్తింది. ‘టీ20 వరల్డ్​కప్​తో పాటు చైర్మన్​ విషయంలోనూ నిర్ణయం తీసుకోకుండా ఐసీసీ టైమ్​ వేస్ట్​ చేస్తోంది. అంటే అక్కడ సత్తా ఉన్నోళ్లు లేరని అర్థమవుతుంది. అలాంటప్పుడు అందులో పని చేయడం ఎందుకు? షెడ్యూల్​ ప్రకారం టీ20 వరల్డ్​కప్​ నిర్వహించడం అసాధ్యమని ఐసీసీకి తప్ప మిగతా అందరికీ తెలుసు. అయినా నిర్ణయం రాదు. వాళ్ల మనసులో ఏముందో అర్థం కావడం లేదు’ అని బీసీసీఐ అధికారి ఒకరు విమర్శించారు.

షెడ్యూల్‌‌ ప్రకారం అక్టోబర్‌‌ 18 నుంచి నవంబర్‌‌ 15 వరకు ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్‌‌కప్‌‌ జరగాల్సి ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో 16 టీమ్స్‌‌ను ఒక్కచోటుకు తీసుకురావడం జరిగే పని కాదని క్రికెట్‌‌ ఆస్ట్రేలియా (సీఏ)  చైర్మన్‌‌ ఎర్ల్‌‌ ఎడ్డింగ్స్‌‌ గత వారం ప్రకటన చేశారు. సీఏ నుంచి ఇలాంటి ప్రకటన వెలువడినా మెగా టోర్నీ అంశాన్ని మాత్రం ఐసీసీ నానుస్తూనే ఉంది. అయితే ఐసీసీ శాశ్వత సభ్యుల్లో ఒకరి ఒత్తిడే ఈ ఆలస్యానికి కారణమని తెలుస్తోంది. అందువల్లే బ్రాడ్‌‌కాస్టర్లు, స్పాన్సర్ల నుంచి ఒత్తిడి వస్తున్నా తగిన నిర్ణయం తీసుకుంటామని చెబుతూ వస్తోంది. టీ20 వరల్డ్‌‌కప్‌‌తోపాటు ఐపీఎల్‌‌కు బ్రాడ్‌‌కాస్టర్‌‌ అయిన స్టార్‌‌ స్పోర్ట్స్‌‌ బోర్డుకు ఇప్పటికే ఘాటుగా మెయిల్స్‌‌ పెట్టింది. టోర్నీల సంగతేంటని, ప్రస్తుత పరిస్థితేంటో తెలియజేయండని ఇటు ఐసీసీతోపాటు బీసీసీఐని ప్రశ్నించింది.

ఈసారి ఐపీఎల్‌‌కు దూరంగా కోకకోలా !
ఐపీఎల్‌ 2020 ఎడిషన్‌‌పై ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతుండగా లీగ్‌‌కు పెద్ద ఎదురుదెబ్బ తగలనుంది. టోర్నీ ప్రధాన స్పాన్సర్లలో ఒకరైనా కోకకోలా ఇండియా ఈ ఏడాది లీగ్‌‌కు దూరంగా ఉండాలని భావిస్తోంది. అడ్వర్‌‌టైజింగ్‌‌లో భాగంగా క్రికెట్‌‌పై రూ.500 కోట్లు దాకా ఖర్చు పెట్టే కోకకోలా ఈ ఏడాది దానిని భారీగా తగ్గించుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఐపీఎల్‌‌కు దూరమయ్యే ఆలోచనలు చేస్తోంది. 2019 ఎడిషన్‌‌లో ఆన్‌ ఎయిర్‌ అడ్వర్‌‌టైజింగ్‌‌ కోసం స్టార్‌ స్పోర్స్ తో కలిసి కోకకోలా రూ.135 కోట్లు ఖర్చు చేసింది. అంతేకాక కోల్‌‌కతా నైట్‌‌రైడర్స్‌‌కు బేవరేజ్స్‌‌ పార్టనర్ గా వ్యవహరించింది. ఈ ఏడాది కూడా ఆ ఒప్పందాలను కొనసాగించాలని తొలుత భావించింది. వీటితో పాటు కొత్త ఒప్పందాల విషయంలో వేరే ఫ్రాంచైజీలతో కూడా చర్చలు జరిపింది. కానీ ఏప్రిల్‌‌–జూన్‌ క్వార్టర్‌‌లో కంపెనీ ఆదాయం భారీగా తగ్గింది. దీంతో ఖర్చులు తగ్గించుకునే పనిలో ఉన్నామని,  ఐపీఎల్‌‌కు దూరంగా ఉండనున్నామని కోకకోలా వర్గాలు అంటున్నాయి. అయితే ఐసీసీతో చేసుకున్న ఒప్పందాన్ని మాత్రం కొనసాగిస్తామని కోకకోలా తెలిపింది.

For More News..

కోట్ల రూపాయల వద్దనుకుంటున్న సెలబ్రిటీలు

మా ప్రాణం తీసెయ్యండి.. వృద్ధ దంపతుల వేడుకోలు

చైనా బార్డర్‌లో మిస్సైల్ తో ఇండియన్ ఆర్మీ

చైనా ఫోన్లతో మనం పోటీ పడగలమా?