
భారతదేశంలో ఆధునిక పత్రికా రంగాన్ని యురోపియన్స్ మొదటిసారిగా ప్రారంభించారు. దీని ఫలితంగా సమాచారం అందరికీ అందుబాటులోకి వచ్చింది. ప్రతికా రంగాన్ని లార్డ్ మెకాలే ఫోర్త్ ఎస్టేట్గా అభివర్ణించారు. భారతదేశంలో మొదటి (ఆంగ్ల) వారపత్రిక అయిన బెంగాల్ గెజిట్ 1780, జనవరి 27న ప్రారంభమైంది. దీన్ని స్థాపించింది జేమ్స్ అగస్టన్ హిక్కి. ఇది ఒక వార, రాజకీయ, వాణిజ్య విషయక పత్రిక. 1782లో గవర్నర్ జనరల్ వార్ హేస్టింగ్స్కు వ్యతిరేకంగా వార్తలు రాసినందుకు హిక్కీని అరెస్టు చేశారు. తత్ఫలితంగా పత్రిక మూతపడింది. ఈ సందర్భంగా పత్రికా స్వాతంత్ర్యం అనేది ఆంగ్లేయులకు మనుగడతో ముడిపడిన హక్కు అని హిక్కీ వ్యాఖ్యానించారు. 1784లో కలకత్తా గెజిట్ స్థాపించారు. ఇదే ప్రభుత్వ అధికారిక పత్రికగా మారింది.
1799లో వెల్లస్లీ పత్రికలపై సెన్సార్షిప్ విధించాడు. 1818లో లార్డ్ హేస్టింగ్స్ సెన్సార్షిప్ తొలగించాడు. దక్షిణ భారతదేశంలో అధికారుల ప్రాపకంతో 1784లో మద్రాస్ కొరియర్ అనే మొదటి పత్రిక మద్రాస్ రాష్ట్రంలో ప్రారంభమైంది. ఇండియన్ హెరాల్డ్స్ పత్రిక సంపాదకుడిని ప్రభుత్వంపైనా, వేల్స్ యువరాజుపైనా అసత్యవార్తలు రాసినందుకుగాను దేశం నుంచి పంపించివేసింది. 1799లో అన్ని పత్రికలూ తమ పత్రిక ప్రతిని ముందుగా ప్రభుత్వ తనిఖీకి సమర్పించిన తర్వాతనే ప్రచురించాలని నిబంధనను ప్రభుత్వం విధించింది. బొంబాయి రాష్ట్రంలో 1789, 1790, 1791ల్లో బాంబే హెరాల్డ్, బాంబే కొరియర్, బాంబే గెజిట్ అనే పత్రికలు వరుసగా వెలువడ్డాయి.
ముఖ్యమైన పత్రికలు
దిగ్దర్శన (1818): ఇది తొలి దేశ భాషా పత్రిక. దీనికి మార్షమన్ సంపాదకత్వం వహించాడు.
సమాచార దర్పణ్(1818): ఈ పత్రిక సంపాదకుడు కూడా మార్షమన్. ఇది స్థానిక వార్తలను ప్రచురిస్తూ ఆధునిక ఉదారవాద భావాలను ప్రచారం చేసింది. దీనిని విలియం వార్డ్, మార్షన్లు స్థాపించారు.
బంగదూత: సంపాదకుడు మంట్ గోమరీ మార్టిన్.
టైమ్స్ ఆఫ్ ఇండియా: ఇది 1838లో ప్రచురించిన దిన పత్రిక. బాంబే కేంద్రంగా స్థాపించారు.
ది హిందూ పేట్రియాట్: దీనిని 1853లో ఘోష్ సోదరులు కలకత్తా నుంచి వెలువరించారు. సంపాదకుడు హరిశ్చంద్ర ముఖర్జీ.
అమృత బజార్ (1868): ఈ పత్రికను ఘోష్ సోదరులైన శిశిర్కుమార్, మోతీలాల్ ఘోష్లు స్థాపించారు. దీనికి మొదటి సంపాదకుడిగా శిశిర్కుమార్ ఘోష్ పనిచేశారు. ఇది జెస్సోర్లోని మగుర గ్రామం నుంచి వారపత్రికగా మొదలైంది. 1871 నాటిక పత్రికా ప్రచురణ కలకత్తాకు మారింది. 1878లో ఆంగ్ల పత్రికగా మారింది. 1891 నుంచి దినపత్రికగా రూపాంతరం చెందింది. బ్రిటీష్ వారికి, భారతీయులకు మధ్య జాతిపరమైన అంతరాన్ని ఎత్తి చూపుతూ మనం మనమే.. వాళ్లు వాళ్లే అని నినదించింది.
సంజీవని(1883): ఇది ఫ్రెంచి విప్లవ నినాదాలైన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే నినాదాలను స్ఫూర్తి పదాలుగా స్వీకరించింది.
ఏషియాటిక్ మిర్రర్ (1798): కలకత్తా నుంచి వెలువడే ఆంగ్ల వార పత్రిక.
ది హిందూ: 1878లో మద్రాస్ నుంచి వెలువడింది. దీనిని జి.సుబ్రహ్మణ్యం అయ్యర్, విజయరాఘవాచారి, కస్తూరి రంగన్లు ప్రారంభించారు.
ద మెయిల్/ మద్రాస్ మెయిల్: ఇది 1868లో మద్రాస్ ప్రెసిడెన్సీలో ప్రారంభించిన మొదటి ఇంగ్లిష్ సాయంకాలం దిన పత్రిక. దీనిని చార్లెస్ లాపన్, కార్నిష్ స్థాపించారు.
ALSO READ : ఆ వార్తలు నమ్మొద్దు.. అకౌంట్లోకి పీఎం కిసాన్ డబ్బులు వచ్చేది అప్పుడే..
పత్రికా స్వేచ్ఛ/ విముక్తి చట్టం: 1835లో గవర్నర్ జనరల్ చార్లెస్ మెట్కాఫ్ లైసెన్సింగ్ చట్టాన్ని రద్దు చేసి, పత్రికలకు స్వేచ్ఛ కల్పించాడు. ఇతనికి సహాయ పడింది మెకాలే. దీనిని నిరసిస్తూ ఈస్ట్ ఇండియా కంపెనీ అతనిని స్వదేశం పిలిపించింది. మెట్కాఫ్భారత పత్రికలకు స్వాతంత్ర్యం ప్రసాదించినవారు అంటారు.
ప్రాంతీయ భాషా పత్రికల చట్టం: దీనిని లార్డ్ లిట్టన్ ప్రవేశపెట్టాడు. ఇది భారతీయ పత్రికల నోరు నొక్కే చట్టం గ్యాగింగ్ యాక్ట్. దీనిని ఐరిష్ పేపర్ యాక్ట్ ఆధారంగా తెచ్చారు. ఈ చట్టాన్ని తర్వాత రిప్పన్ 1882లో తొలగించాడు. బెంగాలీ భాషలో వెలువడే అమృత బజార్ ఈ చట్టం వల్ల పత్రికగా మారింది.
న్యూస్ పేపర్ యాక్ట్ (1908): వందేమాతరం ఉద్యమ కాలంలో ప్రవేశపెట్టారు. ఈ చట్టం వల్ల యుగాంతర్, వందేమాతరం వంటి అతివాద పత్రికలు మూతపడ్డాయి.
ఇండియన్ ప్రెస్ చట్టం (1910): పత్రికలు చెల్లించాల్సిన సొమ్ము డిపాజిట్లు పెంచారు అభ్యంతరకరమైన అంశాలు అనే పదాన్ని నిర్వచించారు. ఈ నిర్వచనం పరిధిలోకి పాలకులు, న్యాయమూర్తులు, పబ్లిక్ సర్వెంట్లు వచ్చారు. ఈ చట్టం మొదటి ప్రపంచ యుద్ధకాలం (1914–1918)లో తీవ్రంగా అమలు చేశారు.