రకుల్ ప్రీతి సింగ్ (Rakul Preet Singh) నటుడు, నిర్మాత జాకీ భగ్నానీ (Jackky Bhagnani) ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట ఫిబ్రవరి 22న పెళ్లి పీటలెక్కనుందని సమాచారం. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమంక్షంలోనే వీరు వెడ్డింగ్ జరుపుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే మొదట వీదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్కి రకుల్ ప్రీత్ సింగ్ -జాకీ రెడీ అయ్యారు. కానీ ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) పిలుపుతో వెడ్డింగ్ వేదిక మార్చుకున్నట్లు సమాచారం.
కొన్ని రోజుల క్రితం ప్రధాని మోదీ లక్ష్యద్వీప్ పర్యటనకు వెళ్లి.. డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలనుకునే వారు వేరే దేశాలకు వెళ్లకుండా మన దేశంలోనే మంచి పర్యాటక ప్రదేశాలను సెలక్ట్ చేసుకోవాలని పిలుపునిచ్చారు. దీనికి దేశవ్యాప్తంగా మంచి స్పందన వస్తోంది. ఇకపై వెకేషన్కు స్వదేశంలో ఉన్న ప్రాంతాలకు మాత్రమే వెళ్తామని పలువురు సెలబ్రెటీలు చెప్పారు. ఈ క్రమంలోనే రకుల్ జంట కూడా పెళ్లి వేదిక మార్చుకున్నట్లు సమాచారం.
విదేశాల్లో కాకుండా స్వదేశంలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఓ వార్త వైరల్ అవుతోంది. వివాహ వేదికను విదేశాల నుంచి గోవాకి షిప్ట్ చేశారనే టాక్ వినిపిస్తుంది. కుటుంబ సభ్యులతో చర్చించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇటీవలే అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్టకు కూడా ఈ జంట హాజరైంది.