మ‌ధ్యాహ్న భోజ‌నంలో.. టైం ఫాలోకాక‌పోతే వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌లు ఇవే..!

మ‌ధ్యాహ్న భోజ‌నంలో.. టైం ఫాలోకాక‌పోతే వ‌చ్చే అనారోగ్య స‌మ‌స్య‌లు ఇవే..!

ఈ రోజుల్లో ఆరోగ్యంగా ఉండడమంటే సవాలుతో కూడుకున్న విషయమనే చెప్పాలి. రోజుకో వ్యాధి పుట్టుకొస్తున్న ఈ జనరేషన్ లో.. నిత్యం ఆరోగ్యంగా ఉండేందుకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్కోసారి ఎన్ని జాగ్రత్తలు పాటించినా జరగాల్సిన నష్టం జరుగుతూనే ఉంటుంది. కానీ అలా అని ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే మరింత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ కాలంలో డబ్బు సంపాదించాలన్న ధ్యాసలో చాలా మంది సరిగా నిద్ర పోవట్లేదు, సమయానికి తిండి తినట్లేదు. అనారోగ్యం పాలవడానికి ఇవి చాలదా. కాబట్టి తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో.. దాన్ని సరైన సమయానికి తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. సమయానికి భోజనం చేస్తే అనేక కడుపు సంబంధిత సమస్యలను నివారించవచ్చు. మరి ఆలస్యంగా భోజనం చేయడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో బాలీవుడ్ ప్రముఖుల అభిమాన పోషకాహార నిపుణుడు రిజుతా దివేకర్ చెప్పిందేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలస్యంగా భోజనం చేయడం వల్ల కలిగే నష్టాలు

ఎసిడిటీ

ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంటల మధ్య అంటే సరైన సమయానికి భోజనం చేయకపోతే, కడుపులో ఎసిడిటీ సమస్య తలెత్తవచ్చు. సమయానికి భోజనం చేయకపోవడం వల్ల అనేక ఇతర జీర్ణ సమస్యలు కూడా వస్తాయని రిజుతా దివేకర్ అంటున్నారు. అటువంటి పరిస్థితిలో, కడుపు సంబంధిత వ్యాధులను నివారించాలనుకుంటే, సరైన సమయంలో భోజనం చేయడం చాలా అవసరం. కడుపులో ఎసిడిటీ సమస్య ఏర్పడడాన్ని వైద్య భాషలో గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి లేదా యాసిడ్ రిఫ్లక్స్ వ్యాధి అంటారు.

తలనొప్పి

సమయానికి భోజనం చేయకపోవడం వల్ల తలనొప్పి వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఆకలి వల్ల వస్తుంది. భోజనం ఆలస్యం చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఇది తలనొప్పిని ప్రేరేపిస్తుంది. ఈ తలనొప్పి కారణంగా కొన్నిసార్లు చిరాకు కూడా వస్తుంది.

గ్యాస్

మధ్యాహ్నం భోజనం చేయకపోతే కడుపులో గ్యాస్ సమస్య రావచ్చు. కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్, మీథేన్, హైడ్రోజన్, ఆక్సిజన్‌లతో తయారైన వాయువులు కూడా పొత్తికడుపులో నొప్పిని కలిగిస్తాయి. అటువంటి పరిస్థితిలో ఆలస్యంగా భోజనం చేసే అలవాటును మార్చుకుంటే చాలా మంచిది.