Wasim Akram: పాకిస్థాన్ క్రికెట్ ప్రస్తుతం చరిత్రలోనే అత్యంత ఘోరమైన స్థితిలో కూరుకుపోయింది. ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో దారుణ ప్రదర్శన, డ్రెస్సింగ్ రూమ్లో విభేదాలతో ఏకంగా హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్తో పాటు ఏడుగురు ఆటగాళ్లను పీసీబీ స్వదేశానికి పంపించేసింది. ఈ అంతర్గత రచ్చపై పాక్ లెజెండరీ ఫాస్ట్ బౌలర్ వసీమ్ అక్రమ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్ క్రికెట్ జట్టును కాపాడటానికి మీరు ఎందుకు సాయం చేయడం లేదని అభిమానులు తనను పదే పదే నిలదీస్తున్నారని, కానీ లోపాలు చాలా లోతుగా ఉన్నందునే తాను సాయం చేయలేకపోతున్నానని అక్రమ్ తేల్చి చెప్పాడు.
వ్యవస్థే నాశనమైంది.. నేనొక్కడినే ఏం చేయగలను:
వసీమ్ అక్రమ్ మాట్లాడూతూ.. నా దగ్గరికి వచ్చి పాకిస్థాన్ క్రికెట్కు ఏదైనా సాయం చేయొచ్చు కదా అని అందరూ అడుగుతుంటారు.. కానీ సమస్యలు చాలా దారుణంగా ఉన్నాయి. ప్రస్తుతం ఆడుతున్న వీళ్లే మన దేశంలో ఉన్న టాప్ ప్లేయర్లు, అంతకుమించి కిందిస్థాయిలో టాలెంట్ లేదు.. గత కొన్నేళ్లుగా మన ఫస్ట్ క్లాస్ డొమెస్టిక్ క్రికెట్ వ్యవస్థ పూర్తిగా నాశనమైంది. స్థిరత్వం, ఓపిక అనేది పీసీబీలో అసలు కనిపించడం లేదన్నాడు. పునాదులే సరిగ్గా లేనప్పుడు నేనొక్కడినే వచ్చి ఏమీ మార్చలేనంటూ సుదీర్ఘకాలంగా పాక్ క్రికెట్ బోర్డులో జరుగుతున్న నాటకాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.
కోచ్, ప్లేయర్లపై వేటు.. మిస్బా రాజీనామాతో రచ్చ పీక్స్:
లార్డ్స్లో జరిగిన రెండో టెస్టు ఓటమి తర్వాత పాక్ క్రికెట్లో చాలా పెద్ద డ్రామా నడిచింది. క్రమశిక్షణ తప్పారనే నెపంతో హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్ను, ఆటగాళ్లను బోర్డు ఇంటికి పంపించడమే కాకుండా సెలెక్షన్ కమిటీకి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన మాజీ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ తన సెలెక్టర్ పదవికి కూడా రాజీనామా చేశాడు. దీనిపై స్పందించిన అక్రమ్.. ప్రతిసారి మ్యాచ్లు ఓడిపోగానే మొత్తం వ్యవస్థను ఊడ్చేయడం పీసీబీకి అలవాటుగా మారిపోయింది, ఇంగ్లాండ్పై 3–0 తేడాతో దారుణంగా ఓడిపోతామని తనకు ముందే తెలుసని ఆవేదన వ్యక్తం చేశాడు.
►ALSO READ | కష్టాల్లో సౌత్ జోన్.. గ్రౌండ్లో తిలక్ వర్మ అసహనం.. మైదానంలోనే వైభవ్ కిరాక్ డ్యాన్స్!
డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో అట్టడుగున పాకిస్థాన్:
ఒకప్పుడు టెస్టుల్లో నంబర్-1 జట్టుగా ఉన్న పాకిస్థాన్, ప్రస్తుతం వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉండటం వారి దారుణ స్థితికి అద్దం పడుతోంది. జట్టులో మార్పు తేకుండా కేవలం ఆటగాళ్లను, కోచ్లను మార్చడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని వసీమ్ అక్రమ్ స్పష్టం చేశాడు. ఇంగ్లాండ్తో జరిగే ఆఖరి టెస్టులో క్లీన్స్వీప్ తప్పించుకోవడమే పాకిస్థాన్ ముందున్న ఏకైక లక్ష్యం కాగా.. పీసీబీలోని ఈ అంతర్గత అధికార పోరు, దిగ్గజాల బహిరంగ విమర్శలు పాక్ క్రికెట్ భవిష్యత్తును మరింత అంధకారంలోకి నెట్టేలా కనిపిస్తున్నాయి.
