ఇన్ ప్లూయెంజా వైరస్ కోవిడ్ మహమ్మారిగా మారుతుందా..? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు..?

ఇన్ ప్లూయెంజా వైరస్ కోవిడ్ మహమ్మారిగా మారుతుందా..? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు..?

ఇన్ ప్లూయెంజా (హెచ్3ఎన్2) వైరస్ కేసులు పెరుగుతుండడం ఇప్పుడు సర్వత్రా ఆందోళన కల్గిస్తోంది. కరోనా మహమ్మారి మాదిరిగా కల్లోలం రేపే అవకాశం ఉందనే ప్రచారం ప్రజల్లో సాగుతోంది. ఇప్పటికే యావత్ ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తో లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ బాధ నుంచి తేరుకోకముందే కొత్త కొత్త వైరస్ లు పుట్టుకురావడం ఆందోళన కల్గిస్తోంది. తాజాగా H3N2 వైరస్ కేసులు ఇండియాలో పెరుగుతుండడంతో వైద్యారోగ్యశాఖ మరింత అప్రమత్తమైంది. కేసుల నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది.

కోవిడ్ లాక్‌డౌన్‌ సమయంలో పిల్లలు ఇన్ ప్లూయెంజా వైరస్‌కు గురికాకపోవడం వల్లే కేసులు అకస్మాత్తుగా పెరిగిపోయాయని ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ ధీరేన్ గుప్తా చెబుతున్నారు. సాధారణ పరిస్థితుల్లో వైరస్ ప్రాణాంతకం కాదంటున్నారు. 

కోవిడ్ 19, ఇన్ ప్లూయెంజా (హెచ్3ఎన్2) వైరస్ ల మధ్య ఎటువంటి సంబంధం లేదంటున్నారు. రెండూ వైరస్ లు ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతాయని, లక్షణాలు కూడా ఇంచు మించు ఒకేవిధంగా ఉంటాయని ఢిల్లీలోని ప్రైమస్ ఆస్పత్రి పల్మనరీ హెడ్, డాక్టర్ SK ఛబ్రా చెబుతున్నారు. ఇన్ ప్లూయెంజా (హెచ్3ఎన్2) లక్షణాలు కోవిడ్ 19 తరహాలోనే ఉంటాయంటున్నారు. వైరస్ సోకిన వారిలో జలుబు, బాడీ పెయిన్స్, తలనొప్పి ఉంటుందంటున్నారు. కోవిడ్ 19 బారిన పడిన వారు ఇన్ ప్లూయెంజా (హెచ్3ఎన్2) వైరస్ బారిన పడుతారని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని, వైరస్ సోకే అవకాశం సైతం లేదంటున్నారు వైద్య నిపుణులు. 

ఇండియాలో 2023 మార్చి 9వ తేదీ వరకూ 3వేల 38 కేసులు H3N2 వైరస్ కేసులు నమోదయ్యాయి. H3N2  సోకి ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. ఒకరు హర్యానాలో, మరొకరు కర్నాటకలో మృతిచెందారు. కరోనా కేసుల మాదిరిగా ఇన్ ప్లూయెంజా కేసులు పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ముఖ్యంగా కేసుల రెట్టింపుతో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య సైతం పెరుగుతోంది. 

ప్రధానంగా ఇన్ ప్లూయెంజా (హెచ్3ఎన్2) వైరస్ పందుల మధ్య వ్యాపిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. ఇదే వైరస్ మనుషులకు కూడా సోకుతుందని హెచ్చరిస్తున్నారు. కొత్త కొత్త వైరస్ లు ఎన్ని పుట్టుకొచ్చినా ప్రజలు మాత్రం తప్పనిసరిగా ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు. ప్రజలు కోవిడ్ బారిన పడకుండా ప్రోటోకాల్స్, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని చెబుతున్నారు.