- రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఐదు వేల ఖాళీలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్ల స్థానాల్లో ఎలక్షన్లు పెట్టేందుకు సర్కారు వెనకడుగు వేస్తోంది. ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతిపాదన పెట్టినా ప్రభుత్వం ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కరోనా కారణంగా రెండేండ్ల నుంచి ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. ఆ తర్వాత వచ్చిన ఓమిక్రాన్ ఇప్పుడు పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో ఎలక్షన్ల నిర్వహణకు ఎన్నికల సంఘం రెడీ అయింది. సర్కారు నుంచి అనుమతి వస్తే ఏప్రిల్లో ఎలక్షన్లకు అవకాశముందని ఎస్ఈసీ అధికారులు చెబుతున్నారు.
ఐదు వేల ఖాళీలు
రాష్ట్రంలో వార్డు మెంబర్లు, సర్పంచ్లు, ఉపసర్పంచ్ లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ సీట్లు అన్ని కలిపి సుమారు ఐదు వేల వరకు ఖాళీలున్నాయి. వీటిలో వార్డు మెంబర్లు 4,235, సర్పంచ్ లు 169, ఎంపీటీసీలు 88 ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో ఇంటర్, టెన్త్ ఎగ్జామ్స్ ఏప్రిల్, మే నెలల్లో స్టార్ట్ కానున్నాయి. ఈ ఎగ్జామ్స్కు ముందే ఎన్నికలు జరిపే అవకాశాలున్నాయి. ‘కరోనా వల్ల ఎన్నికలు లేటయ్యాయి. ఏప్రిల్లో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నాం. ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వగానే ప్రాసెస్ట్ స్టార్ట్ చేస్తం.’ అని రాష్ట్ర ఎన్నికల సంఘానికి చెందిన ఓ అధికారి తెలిపారు.
వ్యతిరేకత ఉందనే ఎలక్షన్లు పెడ్తలె
రాష్ట్రంలో దుబ్బాక, హుజూరాబాద్, నాగార్జున సాగర్ బై పోల్స్నిర్వహించారు. వాటికి లేని కరోనా రూల్స్ లోకల్ బాడీ ఎన్నికలకు ఎందుకు? క్షేత్రస్థాయిలో అధికార పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఉంది. అందుకే ఎన్నికలకు పోవట్లే. రాజ్యాంగంలో 73 ఆర్టికల్ ప్రకారం సర్పంచ్ పదవి ఖాళీ అయిన 45 రోజుల్లో ఎన్నిక జరపాలి. కానీ పట్టించుకోవడం లేదు. వెంటనే ఎలక్షన్లు పెట్టాలి. - చింపుల సత్యనారాయణ రెడ్డి, పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షుడు
ఖాళీగా ఉన్న లోకల్ బాడీ సీట్లు
జడ్పీటీసీలు 3
ఎంపీటీసీలు 88
సర్పంచ్ లు 169
గ్రామ పంచాయతీ
వార్డు మెంబర్లు 4,235
జడ్పీ వైస్ చైర్మన్ పోస్ట్ 1
ఉప సర్పంచ్ ఖాళీలు 337
ఎంపీపీ ఖాళీలు 5