
సొంతింటిని ప్రతి ఒక్కరు వారికి ఇష్టం వచ్చిన రీతిలో కట్టుకుందామనుకుంటారు. చాలామంది ఇల్లు కట్టడం ప్రారంభించి.. తరువాత కొన్ని కారణాల వలనో.. లోన్ మంజూరు కాకనో... ఆర్థిక ఇబ్బందుల వల్లో మధ్యలోనే ఆపేస్తారు. అలా ఇంటి నిర్మాణాన్ని మధ్యలో ఆపేస్తే ఇబ్బందులు వస్తాయా.. అలాగే రోడ్డు స్థలంలో బోరు ఉంటే నష్టమేమైనా ఉంటుందా.. వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ గారు సూచనలను తెలుసుకుందాం .. .
ప్రశ్న: ఇల్లు కడదామని పిల్లర్లు వేశాను. ఆర్థిక ఇబ్బందుల వల్ల అంతటితోనే ఆపేయాల్సి వచ్చింది. ఏడాది గడిచింది. కొందరు అలా ఆపొద్దు, స్లాబ్ వెయ్యమని సలహా ఇస్తున్నారు. ఇల్లు మధ్యలో ఆపడం వల్ల ఇబ్బందులొస్తాయా?
జవాబు: ఇల్లు కట్టడం మధ్యలో ఆపడం వల్ల ఇంట్లో వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు రావు. నష్టం జరగదు. వాస్తు ప్రకారం ఇంటి ప్లాన్ సరిగా లేకపోయినా కూడా మధ్యలో ఆగిపోవచ్చు. ఇంట్లో వాళ్లకు సమస్యలూ రావచ్చు. కాబట్టి మీకు దగ్గర్లో ఉన్న వాస్తు సిద్ధాంతిని పిలిపించి ఒకసారి ఇంటిప్లాస్ చూపించండి. ఏమైనా మార్పులు ఉంటే చేయించండి.
ప్రశ్న:మాకు 200 గజాల స్థలం ఉంది. ఉత్తరం దిక్కున పది గజాలు రోడ్డు కోసం వదలాల్సి వచ్చింది. బోరు ఆ స్థలంలో ఉంది. ఆ నీళ్లే వాడుకుంటున్నాం. ఏమైనా ఇబ్బందులు వస్తాయా? కొత్త బోరు వేయించుకోవాల్సిన అవసరం ఉందా?
జవాబు: రోడ్డు కోసం వదిలిన స్థలంలో బోరు ఉన్నా, సమస్యలు రావు. ఆ బోరు నీళ్లు ఎప్పట్లాగే వాడుకోవచ్చు. వాస్తు ప్రకారం మీ ఇంటికి, రోడ్డు స్థలంలో ఉన్న బోరుకు ఎలాంటి సంబంధం ఉండదు. ఎందుకంటే.. అది పూర్తిగా ప్రభుత్వ స్థలం కాబట్టి. మీరు కొత్తగా బోరు వేయించుకోవాలనుకుంటే ఉత్తర ఈశాన్యంలో వేయించుకుంటే మంచిది.
–వెలుగు,లైఫ్–