సైకో భర్త : టీ 10 నిమిషాలు ఆలస్యం అయ్యిందని.. భార్యను చంపేశాడు

సైకో భర్త : టీ 10 నిమిషాలు ఆలస్యం అయ్యిందని.. భార్యను చంపేశాడు

టీ తీసుకు రావడానికి కాస్త టైం పడుతుందని చెప్పిన భార్యను ఓ వ్యక్తి కత్తితో దారుణంగా పొడిచి, చంపేశాడు. ఢిల్లీకి సమీపంలోని ఘజియాబాద్ లోని భోజ్ పూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రోజూ వారి కూలి అయిన భర్త ధరమ్ వీర్.. తన భార్య సుందరిని టీ తీసుకురమ్మని అడిగాడు. రెండు సార్లు అడిగినా ఆమె తీసుకురాకపోవడంతో.. ఆగ్రహంతో ఊగిపోయిన ఆ భర్త.. సుందరిని వెనుక నుంచి వచ్చి నరికి చంపేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచిందని పోలీసులు తెలిపారు.

ఈ సమయంలో వారి నలుగురు పిల్లలు(ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి) మరో గదిలో పడుకుని ఉన్నారు. తెల్లవారుజామున 6గంటలకు నిద్ర లేచిన సుందరి.. వంటగదిలో పనిలో నిమగ్నమైంది. అంతలోనే నిద్ర లేచిన ఆమె భర్త ధరమ్ వీర్.. టీ తెమ్మని కోరాడు. కానీ ఆమె ఏదో పని చేస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత మరో 5నిమిషాల తర్వాత మళ్లీ పిలిచి టీ తెమ్మన్నాడు. అప్పుడు ఆమె టీ కావడానికి మరో 10నిమిషాలు పడుతుందని చెప్పడంతో.. అతను వెంటనే వంటగదిలోకి కోపంతో వచ్చి, అక్కడున్న పాత్రలను తన్నాడు. ఆ తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్లి.. అప్పటికే స్టవ్ పై టీ పెట్టిన సుందరిని అతను వెనుక నుంచి నరికేశాడని పోలీసులు చెప్పారు.

ఆమె కేకలు వేయడంతో.. నిద్ర నుంచి లేచిన వారి పిల్లలు పరుగెత్తుకుంటూ వెళ్లి ఆమెను కాపాడాలని ప్రయత్నించారు. కానీ ధరమ్.. పిల్లలపైనా కత్తి దూయడంతో వారు భయంతో తమ గదికి పారిపోయారు. ఈ విషయంపై వారి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన తండ్రి టీ కోసం తరచూ గొడవ పడేవాడని, రోజుకు ఐదారు సార్లు టీ తాగే అలవాటు ఉందని చెప్పాడు. తన తల్లి టీ చేయనని చెప్పినా లేదంటే చెప్పగానే తీసుకురాకపోతే ఆమెపై గట్టిగా అరిచేవాడని తెలిపాడు. కానీ అతను తన తల్లిని ఎప్పుడూ కొట్టడం చూల్లేదని, ఆమె డెడ్ బాడీని చూడగానే తామంతా షాక్ కు గురయ్యామని ఆవేదన వ్యక్తం చేశాడు.